బ్యాంకాక్: భారీ ఆశలను రేపిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. టయోటా థాయ్లాండ్ ఓపెన్లో నిరాశపర్చారు. సూపర్-1000 ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్కు వచ్చిన భారత ద్వయం ఫైనల్ బెర్త్ సాధించలేకపోయింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ 18-21, 18-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా-సో వుయ్ యిక్ (మలేసియా)ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ను సాత్విక్-చిరాగ్ 4-2 లీడ్తో మొదలుపెట్టారు. కానీ వెంటనే తేరుకున్న మలేషియా జోడీ 11-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కాసేపు మ్యాచ్ హోరాహోరీగా సాగినప్పటికీ ఆరోన్-విక్ తొలి గేమ్ను ఖాతాలో వేసుకుంది. సెకండ్ గేమ్లోనూ ఇండియాకు మంచి స్టార్ట్ దొరికింది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన మలేషియా జంట 7-3తో లీడ్లోకి వచ్చి సాత్విక్-చిరాగ్పై ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత ఇండియా జంట 8-8తో స్కోర్ సమం చేసినప్పటికీ కీలక సమయంలో ఆరు మ్యాచ్ పాయింట్లు సాధించిన మలేషియా జోడీ పట్టు బిగించింది. అదే ఊపుతో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది.
మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్-అశ్వినీ పొన్నప్ప జోడీ 20-22, 21-18, 12-21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్క్రో-సప్సిరి తెరాతనచయ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి రెండు గేమ్లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్లో థాయ్లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
'మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి' అని సాత్విక్-అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్-చిరాగ్, సాత్విక్-అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది.