బ్యాంకాక్: జపాన్ ఓపెన్లో నిరాశపరిచిన భారత షట్లర్లు థాయ్లాండ్ ఓపెన్లోనూ అదే దారిలో నడుస్తున్నారు. ఏస్ షట్లరు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అనూహ్య ఓటములతో థాయ్లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. అయితే సాయి ప్రణీత్, సాత్విక్ జోడీ క్వార్టర్స్కు చేరుకుంది. ఇప్పుడు భారత్ ఆశలన్నీ సాయిప్రణీత్పైనే ఉన్నాయి.
ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం.. అతనిలా మ్యాచ్లు ముగించాలనుకుంటున్నా
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో ఏడో సీడ్ సైనా 21-16, 11-21, 14-21తో అన్ సీడెడ్ సయాకా టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సైనా మొదటి గేమ్ గెలిచినా.. అనవసర తప్పిదాలతో తర్వాతి రెండు గేమ్ల్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది. సుమారు రెండు నెలల అనంతరం బరిలోకి దిగిన సైనా.. తకహాషి జోరు ముందు నిలవలేకపోయింది.
పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-11, 16-21, 12-21తో కోసిట్ ఫెట్ప్రదాబ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ నెగ్గినా.. మిగిలిన రెండు గేమ్లలో సత్తా చాటలేక టోర్నీ నుండి నిష్క్రమించాడు. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 9-21, 14-21తో చొ టిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. జపాన్కు చెందిన ఆరోసీడ్ కెంటో నిషిమోటో చేతిలో 21-17, 21-10తో ప్రణయ్ ఓడిపోయాడు.
జపాన్ ఓపెన్లో సెమీస్ చేరిన సాయి ప్రణీత్ అదే జోరును కొనసాగిస్తున్నాడు. ప్రీ క్వార్టర్స్లో ప్రణీత్ 21-18, 21-19తో శుభాంకర్ డేపై గెలుపొందాడు. వరుస గేముల్లో తన ఆధిపత్యం చూపించి 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. ఇక క్వార్టర్స్లో జపాన్ షట్లర్ కాంటా సునెయామాతో ప్రణీత్ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ 21-17, 21-19తో ఇండోనేసియా జంట ఫజర్ అలీఫన్-మహమ్మద్ రియాన్ అర్డియాంటోపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్-అశ్విని పొన్నప్ప జంట 21-18, 21-19తో అల్ఫియాన్-మార్షెయిలా ఇస్లామి (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది.