బ్యాంకాక్: భారత స్టార్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ నుండి వైదొలిగింది. వరల్డ్ చాంపియన్షిప్పై మరింత దృష్టి పెట్టేందుకు సింధు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇండోనేసియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సింధు.. జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత్.. తన ఆశలన్నీ మరో షట్లర్ సైనా నెహ్వాల్పై పెట్టుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
మంగళవారం ప్రారంభం కానున్న థాయ్లాండ్ ఓపెన్ టోర్నీలో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్ బరిలోకి దిగుతున్నారు. గాయం కారణంగా ఇండోనేషియా, జపాన్ ఓపెన్ టోర్నీలకు దూరమైన సైనా.. ఏడో సీడ్గా బరిలోకి దిగుతోంది. టైటిల్ గెలిచి వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని సైనా పట్టుదలగా ఉంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్తో సైనా తలపడుతుంది.
జపాన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైన కిడాంబి శ్రీకాంత్పై భారీ అంచనాలే ఉన్నాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్తో ఐదో సీడ్ శ్రీకాంత్ తలపడనున్నాడు. జపాన్ ఓపెన్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్ వరకు చేరిన సాయి ప్రణీత్.. కాంటాఫాన్ (థాయ్లాండ్)తో పోటీలోకి దిగుతున్నాడు. జిల్బర్మన్ (ఇజ్రాయెల్)తో కశ్యప్, లీ జియా (మలేసియా)తో సమీర్వర్మ పోటీపడతారు. ఇక పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్తో సుమీత్-మను.. మహిళల డబుల్స్లో వెన్- జెంగ్ (చైనా)తో సిక్కి- అశ్విని తలపడతారు.