హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ కేటగిరీలో జయ కేతనాన్ని ఎగరవేసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇంటికి చేరుకున్నారు. టోక్యో నుంచి మంగళవారం సాయంత్రమే స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆమెను సన్మానించింది. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్ ఆమెను ఘనంగా సన్మానించారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన పీవీ సింధు.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరారు.
కోచ్, దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ ప్లేయర్ పార్క్ తయీ-సంగ్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆమెను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సైబరాబాద్ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గొన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీ ప్రతినిధులు.. పలువురు అధికారులు ఈ సమయంలో మంత్రి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం తనకు అన్ని వేళలా అండగా నిలిచిందని అన్నారు.
ప్రభుత్వం తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిందని చెప్పారు. ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమెను కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు. ఇంటికి చేరిన పీవీ సింధు.. తన మెడల్ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు చూపిస్తూ మురిసిపోయారు. 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్లో తాను తప్పకుండా పాల్గొంటానని అన్నారు. పసిడి పతకం కోసం పోరాడుతానని చెప్పారు. కొన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం తాను టోక్యో ఒలింపిక్స్ విజయాన్ని ఆస్వాదిస్తోన్నానని అన్నారు.
#WATCH | Telangana: Olympic #BRONZE medallist PV Sindhu and her coach Park Tae-Sang reach Sindhu's residence in Hyderabad pic.twitter.com/HqfU6E8vPb
— ANI (@ANI) August 4, 2021