హైదరాబాద్: టాప్ 10లో నిలిచిన క్రీడాకారులే భారత భవిష్యత్ ఆశాకిరణాలని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. భారత్లో బ్యాడ్మింటన్ మెరుగుపడాలంటే టాప్ ప్లేయర్లను మరింత ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ నెగ్గిన తొలి భారత మహిళా షట్లర్ సైనా పలు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లాంటి షట్లర్లు నిలకడగా రాణిస్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటుతోంది.
గతంలో సయ్యద్ మోదీ, ప్రకాష్ పదుకోన్, పుల్లెల గోపీచంద్ లాంటి దిగ్గజాల రికార్డులను ప్రస్తుత షట్లర్లు సాధిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సైనా పలు విషయాలపై మాట్లాడారు. జాతీయ స్థాయిలో టాప్ 10 స్థానాల్లో ఉన్న ప్లేయర్లు మరికొంత మందికి ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే టాప్ ప్లేయర్లకు సదుపాయాలు కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సైనా ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం డబుల్స్, సింగిల్స్ అని ప్రత్యేకంగా కోచింగ్ సదుపాయాలు మెరుగయ్యాయని అభిప్రాయపడ్డారు. పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్ లాంటి అద్భుతమైన కోచ్లు ఉండటం తమ అదృష్టమన్నారు. హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో పీవీ సింధు ఎదిగిన తీరు అందుకు నిదర్శనం అన్నారు. 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ విజేతగా సైనా నిలిచారు.
కెరీర్ ఆలస్యంగా మొదలుపెట్టా..
'మధుమిత బిస్త్, అపర్ణ పొపట్ లాంటి ప్లేయర్ల ఆటను చూస్తూ పెరిగాను. వీరు సాధించిన మెడల్స్ సాధించేందుకు మొదట్లో చాలా కష్టపడ్డాను. నేను తొమ్మిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలుపెట్టా. కానీ ఆరు లేక ఏడేళ్ల వయసులో ఈ గేమ్ స్టార్ట్ చేయడం బెటర్. అత్యుత్తమ కోచ్లు ఉన్నందున ప్రస్తుతం బ్యాడ్మింటన్ వైపు దృష్టి సారిస్తున్నారని'సైనా వివరించారు.