
లక్నో: సంవత్సర కాలంగా టైటిల్ దక్కించుకోవడంలో విఫలమౌతున్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్ హాట్ ఫేవరెట్లుగా సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. లక్నో వేదికగా మంగళవారం నుంచి సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. స్టార్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టోర్నీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. కాగా, ఒలింపిక్ రజత పతక విజేత సింధు టోర్నీలో ఆడేందుకు సుముఖత చూపలేదు.
వచ్చేనెల చైనాలో జరిగే సీజన్ చివరి టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్పై దృష్టి సారించేందుకు ఈ టోర్నీకి దూరమౌతున్నట్లు సింధు ప్రకటించింది. ఆమె గైర్హాజరీలో సైనాకు ఈ టోర్నీలో పెద్దగా సవాల్ ఎదురుకాకపోవచ్చు. తొలిరౌండ్లో కేట్ కునేతో తలపడనుండగా.. ఫైనల్ చేరేవరకు గట్టి ప్రత్యర్థులెవరు బరిలో కనిపించడం లేదు. అన్నీ అనుకున్నట్లు సాఫీగా సాగితే ఫైనల్లో చైనాకు చెందిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ లీ గ్జుర్యుతో తలపడాల్సి రావచ్చు.
కాగా, మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సమీర్ వర్మ ఈ టోర్నీలో మళ్లీ విజయంతో టైటిల్ నిలుపుకోవడంతోపాటు ప్రపంచ టూర్ ఫైనల్స్కు అర్హత సాధించాలని కోరుకుంటున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్లు ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డి జోడీ మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ప్రయత్నంలో ఉంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్కు కూడా అనుకూలమైన డ్రా పడింది. కాగా, రెండోరౌండ్లో భారత్కే చెందిన పారుపల్లి కశ్యప్ రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. వీరితో పాటు కశ్యప్, సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, శుభాంకర్ సింగిల్స్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ రాంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీతోపాటు జాతీయ చాంపియన్లు మను అత్రి, సుమీత్ రెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.