లక్నో: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సయ్యద్ మోదీ ప్రపంచ టూర్ సూపర్ సిరీస్లో శుభారంభం చేసింది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ముందంజ వేశారు. ఫేవరెట్గా బరిలోకి దిగిన రెండోసీడ్ సైనా బుధవారం జరిగిన తొలిరౌండ్లో 21-10, 21-10స్కోరుతో వరుసగేముల్లో మారిషస్కు చెందిన కేట్ ఫోను వరుసగేముల్లో ఓడించి రెండోరౌండ్ చేరింది.
ఈ టోర్నీలో మూడుమార్లు చాంపియన్గా నిలిచిన హైదరాబాదీ అంచనాలకు అనుగుణంగానే రాణించి విజయంతో టైటిల్ దిశగా అడుగు ముందుకు వేసింది. రెండోరౌండ్లో మనదేశానికే చెందిన అమోలికా సింగ్ సిసోసియాతో సైనా తలపడనుంది. కాగా, పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 21-14,21-12 స్కోరుతో థాయిలాండ్కు చెందిన తనోంగ్సక్ సేన్సాంబూన్సక్ను ఓడించి ముందంజ వేశాడు. రెండోరౌండ్లో ఇండోనేషియా షట్లర్ ఫిర్మన్ అబ్దుల్ ఖోలిక్తో తలపడనున్నాడు.
Lucknow ..... Syed Modi international tournament 2018 ☺️☺️👍 pic.twitter.com/Cymgl6ewlU
— Saina Nehwal (@NSaina) November 19, 2018
ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సిరిల్ వర్మ 12-21, 17-21తో సమీర్ వర్మ (భారత్) చేతిలో, చిట్టబోయిన రాహుల్ యాదవ్ 19-21, 21-8, 18-21తో మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డికి షాక్ తగిలింది. కాగా, సిక్కిరెడ్డి-అశ్విని జోడీ డబుల్స్లో గెలుపొందింది.
సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 14-21, 11-21తో రెన్ జియాంగ్జు-చావోమిన్ జౌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. భారత ఆటగాడు సాయి ప్రణీత్ 21-12,21-10 స్కోరుతో రష్యాకు చెందిన సెర్గీ సిరియంట్పై , శుభాంకర్ డే 21-15,21-13 స్కోరుతో చైనాకు చెందిన లు గుయాంగ్జుపై గెలిచాడు.