
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భారత క్రికెటర్ సురేశ్ రైనా సందడి చేశాడు. డిసెంబరులో ప్రారంభమైన పీబీఎల్ పోటీలు ప్రస్తుతం లక్నోలో జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా మంగళవారం అవధె వారియర్స్-అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ మధ్య మ్యాచ్లు నిర్వహించారు.
ఈ పోటీలకు భారత క్రికెటర్ సురేశ్ రైనా హాజరయ్యాడు. దీంతో స్టేడియం రైనా అనే పిలుపుతో మార్మోగింది. అవధె వారియర్స్ 4-3తో విజయం సాధించింది. అనంతరం వారియర్స్ ఆటగాళ్లు రైనాతో కలిసి ఫొటోలు దిగారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన తల్లితో కలిసి రైనాతో ఫొటోకు ఫోజులిచ్చింది.
అనంతరం సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. 'మ్యాచులు తిలకించేందుకు వచ్చి.. ఆటగాళ్లను ప్రోత్సహించిన రైనాకు ధన్యవాదాలు' అని పేర్కొంది. అలాగే 'పీబీఎల్ టోర్నీ సందర్భంగా బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ జట్టు అవధె వారియర్స్కు మద్దతివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. జట్టుకు నా శుభాకాంక్షలు' అని రైనా తెలిపాడు.
సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పాల్గొనేందుకు రైనా లక్నోచేరుకున్నాడు. యో యో పరీక్ష పాసైన రైనా దేశవాళీ క్రికెట్లో అంతగా రాణించకపోవడంతోనే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ సెలక్టర్లు తెలిపారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో రైనా చెన్నై సూపర్ కింగ్స్ లోనే ఆడనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.