
హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి ఫైనల్కు చేరుకుంది. గ్రూప్ దశలో మూడు విజయాలతో తన జైత్రయాత్రను కొసాగించిన సింధు.. ఈ మెగా టోర్నీలో టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది.
శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ సింధు 21-15, 21-18తో చైనా ప్లేయర్, 8వ ర్యాంకర్ చెన్ యుఫీపై వరుస గేమ్ల్లో విజయం సాధించింది. ఆదివారం రెండో ర్యాంకర్ అకానె యమగుచితో ఫైనల్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆమెపై 4-2తో సింధుకు మెరుగైన రికార్డుంది.
గతేడాది తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఆడింది సింధు. అయితే ఆ టోర్నీలో సెమీస్ దగ్గర ఆగిపోయింది. కానీ ఈసారి సెమీస్ను అధిగమించి ఫైనల్స్కు చేరుకుంది. టోర్నీలో భాగంగా గత మ్యాచ్లో యమగుచిని 36 నిమిషాల్లోనే మట్టికరిపించిన సింధుకు సెమీస్లో మాత్రం చెన్ యుఫీ నుంచి గట్టి ప్రతిఘట ఎదురైంది.
ఈ మ్యాచ్ నెగ్గేందుకు 59 నిమిషాలు పట్టింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్ ఆరంభంలోనే సిందు 5-0 ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ చెన్ పుంజుకుని స్కోరు సమం చేసింది. తర్వాత సింధును పదేపదే బేస్లైన్కే పరిమితం చేస్తూ ఇబ్బంది పెట్టింది. దీంతో ఒత్తిడికి గురైన పీవీ 6-8తో వెనుకబడింది.
చెన్ కొట్టిన షాట్ లైన్కు అవతల పడగా.. సింధు పదునైన స్మాష్తో 8-8తో స్కోరు సమం చేసింది. ఆపై, 45 షాట్ల పాటు సాగిన ర్యాలీని కోల్పోయిన సింధు వెంటనే తేరు కొని 11-10తో బ్రేక్కు వెళ్లింది. విరామం తర్వాత సింధుకు దూకుడుగా ఆడి 15-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ చెన్ పట్టు వదల్లేదు.
14-16తో ఆమెకు చేరువగా వచ్చింది. అయితే సింధు మళ్లీ ధాటిగా ఆడి ఆరు పాయింట్ల అంతరంతో గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగానే సాగింది. అయితే, ఒక్కసారిగా గేరు మార్చిన సింధు వరుస పాయింట్లతో చెలరేగింది.. ప్రత్యర్థి డిఫెన్స్ మెరుగ్గా ఉన్నా.. పవర్ఫుల్ షాట్లతో కచ్చితమైన ప్లేస్మెంట్లతో ఆకట్టుకుంది.
9-4తో మొదట సింధు పైచేయి సాధించినా.. చెన్ 7-9తో ఆమెకు చేరువగా వచ్చింది. ఈ దశలో 37షాట్ల పాటు సుదీర్ఘంగా సాగిన ర్యాలీని జంప్ స్మాష్తో గెలిచి యుఫీ 15-15తో స్కోరు సమం చేసింది. అయితే 16-16 వద్ద సింధు మూడు వరుస పాయింట్లతో మ్యాచ్ విజయానికి చేరువైంది.
కానీ చెన్ పట్టు వదల్లేదు. 18-19తో మళ్లీ సింధును చేరుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే అలసిపోయిన సింధు పదేపదే బ్రేక్ తీసుకో వడంతో చైర్ అంపైర్ నుంచి వార్నింగ్ కూడా అందు కుంది. తర్వాత చురుకైన రిటర్న్తో పాటు నెట్ వద్ద మెరుగ్గా ఆడిన సింధు 19-16తో సులువుగా మ్యాచ్ నెగ్గేలా కనిపించింది.
కానీ, ఈ దశలో 57 షాట్ల పాటు సుదీర్ఘంగా సాగిన ర్యాలీని కోల్పోయిన సింధు తర్వాత షటిల్ను నెట్కు కొట్టడంతో చెన్ 18-19తో ఆమెకు చేరువైంది. స్టేడియం మొత్తం ఉత్కంఠగా మారిన ఈ దశలో ప్రత్యర్థి కొట్టిన షాట్ నెట్కు తగల గా.. ఆ వెంటనే ఆమె మరో వైడ్ షాట్ ఆడడంతో సింధు గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది.
దీంతో సైనా నెహ్వాల్ (2011) తర్వాత బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సింగిల్స్ ఫైనల్స్కు అర్హత సాధించిన క్రీడాకారిణిగా సింధు అరుదైన ఘనత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్లో అకానె యమగుచి 17-21, 21-12, 21-19తో ఆరో ర్యాంకర్ రచనోక్ ఇంటనోన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది.
ఇక, పురుషుల సింగిల్స్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), లీ చోంగ్ వీ (మలేసియా) ఫైనల్కు చేరారు.
దుబాయి సూపర్ సిరిస్ పైనల్స్: మహిళల సింగిల్స్ ఫైనల్
సింధు Vs యమగూచి
మధ్యాహ్నాం 2.30 గంటల తర్వాత
స్టార్ స్పోర్ట్స్ - 2లో
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.