హైదరాబాద్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ స్టార్ షట్లర్లతో కళకళలాడనుంది. గురువారం నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ బరిలోకి దిగనున్నారు.
ఈ ఏడాది వరుసగా నాలుగు సూపర్ టైటిళ్లు నెగ్గి మంచి ఫామ్ మీదున్న శ్రీకాంత్ను టైటిల్ ఫేవరెట్గా పరిగణిస్తున్నారు. ఇక, మహిళల సింగిల్స్లో సింధు, సైనా ఏదో ఒక దశలో ఎదురుపడే అవకాశం ఉంది. వీరితోపాటు ప్రణయ్, అజయ్ జయరామ్, సాయి ప్రణీత్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, కశ్యప్ కూడా బరిలో నిలవనున్నారు.

ఈ టోర్నీలో 29 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 400 మందికి పైగా పేయర్ల పోటీ పడనున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్, ప్రణయ్, జయరామ్, సాయి ప్రణీత్, కశ్యప్, ఫరీద్లకు నేరుగా ప్రీ క్వార్టర్స్లో అడే అవకాశాన్ని టోర్నీ నిర్వాహకులు కల్పించారు.
సింధు, సైనా, రితుపర్ణదాస్, అనురాకు కూడా ప్రీ క్వార్టర్స్ ఎంట్రీ లభించింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి, మను అత్రి-సుమీత్ రెడ్డి జోడీలకు కూడా నేరుగా క్వార్టర్స్ ఎంట్రీ లభించింది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, మేఘన-పూర్వీష, సంజన-ఆర్తి జోడీలు నేరుగా క్వార్టర్స్లో తలపడనున్నాయి.
82వ ఎడిషన్గా జరుగుతున్న ఈ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నవంబర్ 2 నుంచి 8 వరకు జరగనుంది. బాయ్, మహారాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగ్పూర్లోని డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ పోటీలు జరగనున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ. 60 లక్షలు.