హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అరుదైన గౌరవం దక్కనుంది. కిదాంబి శ్రీకాంత్ పేరుని పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేశారు మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కి బుధవారం ఆయన లేఖ రాశారు.
ఇటీవల డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో విజేతగా నిలిచిన శ్రీకాంత్ ఒక ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని ఆయన ప్రతిపాదన చేశారు.

పద్మ అవార్డు నామినేషన్స్ గడువు సెప్టెంబరు 15నే ముగిసినప్పటికీ... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో విజయ్ గోయల్ తాజాగా ఈ లేఖ రాశారు. 'భారతదేశ యువతకి శ్రీకాంత్ ఐకాన్గా నిలిచాడు. తన విజయాలతో లక్షలాది మందిలో అతను స్ఫూర్తి నింపుతున్నాడు' అని అందులో పేర్కొన్నారు.
'మాజీ క్రీడల మంత్రినైన నన్ను.. చాలా మంది కిదాంబి శ్రీకాంత్ పేరుని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సు చేయాల్సిందిగా కోరారు. ఆ స్ఫూర్తి వారిలో కనిపించింది. అందుకే నేను కిదాంబి శ్రీకాంత్ పేరుని సిఫారసు చేస్తూ లేఖ రాశాను' అని విజయ్ గోయల్ వివరించారు.
24 ఏళ్ల కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఐదు పైనల్స్కు అర్హత సాధించాడు. సాయి ప్రణీత్తో తలపడిన సింగపూర్ ఓపెన్లో రన్నరప్గా నిలవగా మిగతా నాలుగు ఫైనల్స్లో విజయం సాధించాడు. ఈ ఏడాది ఇప్పటికే పీవీ సింధు, ధోని పేర్లని పద్మభూషణ్ అవార్డుల కోసం క్రీడల మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
రిపబ్లిక్ డే రోజున ప్రతి ఏడాది ఈ అవార్డులపై తుది ప్రకటన వెలువడనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పైనల్లో 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటాపై అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి గేమ్ను 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగించి 21- 13తో విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
తద్వారా ఈ సీజన్లో నాలుగో టైటిల్ సాధించాడు. అంతేకాదు సూపర్ సిరీస్ టైటిల్స్ విజయాల్లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్గా కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఘతన సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గిన నాలుగో పురుష షట్లర్గా శ్రీకాంత్ నిలిచాడు. కాంత్కు ముందు లిన్ డాన్ (చైనా), లీ చాంగ్ వుయి (చైనీస్-మలేసియా), చెన్ లాంగ్ (చైనా) మాత్రమే ఈ ఘనత సాధించారు.