హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ సూపర్ సిరిస్కు దూరమయ్యాడు. నాగ్పూర్ వేదికగా ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో శ్రీకాంత్ కాలుకు గాయమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో శ్రీకాంత్ నవంబర్ 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్కు దూరమయ్యాడు. ఈ సందర్భంగా శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడాడు. 'కాలు కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి సూచించారు. దీంతో నేను చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో పాల్గొనడం లేదు' అని అన్నాడు.

నాగ్పూర్లో జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయపడ్డాను. వారం రోజుల్లో తిరిగి నేను పూర్తిగా కోలుకుంటా. ఆ తర్వాత నవంబరు 21 నుంచి 26 మధ్య జరిగే హాంకాంగ్ సూపర్ సిరీస్లో పాల్గొంటా' అని కిదాంబి శ్రీకాంత్ తెలిపాడు. ఈ ఏడాది వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతోన్నాడు.
చైనా సూపర్ సిరిస్కు దూరం కావడంతో నెంబర్ వన్గా నిలవాలనుకున్న శ్రీకాంత్ ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలా ఉంటే జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిన శ్రీకాంత్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే.