
హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షటర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ సైనా 14-21, 21-18, 21-18తో అన్సీడెడ్ డెంగ్ జోయ్ జువాన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది.
గంటా ఐదు నిమిషాల పోరులో ప్రపంచ 37వ ర్యాంకర్ను ఓడించడానికి తొమ్మిదో ర్యాంకర్ సైనా చెమటోడ్చింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ కిదాంబి శ్రీకాంత్ 21-17, 21-11తో వరుస గేముల్లో ఎన్జి కా లాంగ్ (హాంకాంగ్)పై అలవోకగా గెలిచాడు. కిదాంబి శ్రీకాంత్ కేవలం 30 నిమిషాల్లోనే విజయం సాధించాడు.

మరో మ్యాచ్లో క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్ (భారత్) 19-21, 21-19, 21-10తో రస్మస్ జెమ్కీ (డెన్మార్క్)పై నెగ్గి ముందంజ వేశాడు. ఇక, మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి (భారత్) జోడీ 21-16, 22-20తో ఎన్జి టిజ్ యౌ-యెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండోరౌండ్కు చేరుకుంది.
మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనే భారత్కు వ్యతిరేక ఫలితం ఎదురైంది. తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి (భారత్) జంట 19-21, 17-21తో రాబిన్ తాబులింగ్-సెలీనా పియెక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదిలా ఉంటే, గురువారం జరగనున్న రెండో రౌండ్ మ్యాచ్ల్లో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, ఆరోసీడ్ అంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్, యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)తో సైనా తలపడనున్నారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో కెటుట్ మహాదేవి ఇస్తారాణి-రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జోడీతో అశ్విని-సిక్కి జోడీ తలపడనుంది.