
టాప్సీడ్ ఇహాన్ వాం గ్ (చైనా)తో శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో ఐదో ర్యాంకర్ సైనా 13-21, 13- 21తో వరుస గేముల్లో ఓటమిపాలైంది. సైనా మరోమారు చైనా అడ్డుగోడను దాటలేకపోయింది. రెండో సెమీస్లో లీ జుయెరీ (చైనా) చేతిలో 20-22, 18-21తో ఓటమిపాలైన ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్ వాంగ్ (చైనా)తో సైనా కాంస్యం కోసం పోరాడింది.
సైనా విజయం పట్ల ఆమె తండ్రి హరివీర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. సైనా తప్పకుండా పతకం తెస్తానని చెప్పిందని, నిజానికి స్వర్ణం సాధిస్తుందని ఆశించామని ఆయన అన్నారు. దేవుడి దయవల్ల సైనా పతకం సాధించిందని ఆయన అన్నారు. సైనా నెహ్వాల్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
తొలిసారిగా ఒలింపిక్ సెమీస్లో అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సైనా ప్రపంచ నెంబర్వన్ వాంగ్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 42 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో ప్రేక్షకులు ఆద్యంతం సైనా.. సైనా.. అంటూ మద్దతుగా నిలిచారు. పొడగరి అయిన వాంగ్ కోర్డు నలుమూలలా చురుగ్గా కదులుతూ సుదీర్ఘ ర్యాలీలతో సైనాను కట్టడి చేసింది. దీంతో పదేపదే అనవసర తప్పిదాలకు పాల్పడ్డ సైనా తొలిగేమ్ ఆరంభంలోనే 6-11తో వెనకబడింది.
అనంతరం నెట్ గేమ్తో పుంజుకున్నప్పటికీ.. వాంగ్ అద్భుతమైన ప్లేస్మెంట్స్, పవర్ఫుల్ స్మాష్లతో చెలరేగి తొలిగేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ ఇహాన్ అదే జోరు కొనసాగించింది. వైవిధ్యభరితమైన షాట్లతో సైనాను తప్పులు చేసేలా చేసింది. ఇహాన్ సంధించిన బలమైన స్మాష్లకు నెహ్వాల్ వద్ద సమాధానమే లేకపోయింది.