బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లాండు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో టైటిల్ సాదించే దిశగా సైనా నెహ్వాల్ దూసుకుని వెళ్తోంది. కెరీర్లో రెండోసారి ఆమె ఈ టోర్నీలో సెమీ ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం నువ్వా నేనా అన్నట్లు సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ఆమె చైనాకు చెందిన షిజియాన్ వాంగ్ను 23-21, 19-1, 21-16 స్కోరుతో మట్టి కరిపించింది.
పురుషుల సింగిల్స్ పోటీల్లో పారుపల్లి కశ్యప్ కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అతను చైనాకు చెందిన చెన్ లాంగ్ చేతిలో 16-21, 10-21 స్కోరుతో ఓటమి పాలయ్యాడు. సైనా, వాంగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్ ఆరంభంలో సైనా కొంత ఆధిపత్యం సాధించింది. వెంటనే వాంగ్ పుంజుకుని స్కోరును సమం చేసింది. ఓ దశలో 19.16 స్కోరుతో ఆధిక్యత సాధించింది. అయితే, సైనా పుంజుకుని స్కోరును సమం చేసింది. స్కోరు 21-21 ఉన్న దశలో సైనా రెండు వరుస పాయింట్లతో గేమ్ను గెలుచుకుంది.

రెండో గేమ్ ఆరంభంలో సైనా తొలుత వెనకబడింది. అయితే పుంజుకుని ఓ దశలో 17-13 స్కోరుతో మ్యాచ్ విజయానికి చేరువైంది. కానీ వాంగ్ అద్భుతమైన ప్రదర్సన చూపి గేమ్ను గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. స్కోరు 7-7తో సమమైన దశలో సైనా విజృంభించింది. 15-8 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాంగ్ ఆ తర్వాత పుంజుకుని సైనా ఆధిక్యాన్ని 12-15కు తగ్గించింది. సైనా చివరలో తెలివిగా ఆడి మ్యాచును సొంతం చేసుకుంది.
జులియన్ (జర్మనీ), రచనోక్ (థాయిలాండ్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచులో గెలిచే క్రీడాకారిణితో సెమీస్లో సైనా తలపడుతుంది. చైనా క్రీడాకారులంతా నిష్క్రమించడంతో సైనా టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి.