
అయితే మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్లో సైనా మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండో సెమీస్లో లీ జుయెరీ (చైనా) చేతిలో 20-22, 18-21తో ఓటమిపాలైన ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్ వాంగ్ (చైనా)తో సైనా కాంస్యం కోసం పోరాడనుంది. ఈ మ్యాచ్ శనివారం సాయంత్రం 5.30 నుంచి జరుగుతుంది.
తొలిసారిగా ఒలింపిక్ సెమీస్లో అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సైనా ప్రపంచ నెంబర్వన్ వాంగ్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 42 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో ప్రేక్షకులు ఆద్యంతం సైనా.. సైనా.. అంటూ మద్దతుగా నిలిచారు. పొడగరి అయిన వాంగ్ కోర్డు నలుమూలలా చురుగ్గా కదులుతూ సుదీర్ఘ ర్యాలీలతో సైనాను కట్టడి చేసింది. దీంతో పదేపదే అనవసర తప్పిదాలకు పాల్పడ్డ సైనా తొలిగేమ్ ఆరంభంలోనే 6-11తో వెనకబడింది.
అనంతరం నెట్ గేమ్తో పుంజుకున్నప్పటికీ.. వాంగ్ అద్భుతమైన ప్లేస్మెంట్స్, పవర్ఫుల్ స్మాష్లతో చెలరేగి తొలిగేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ ఇహాన్ అదే జోరు కొనసాగించింది. వైవిధ్యభరితమైన షాట్లతో సైనాను తప్పులు చేసేలా చేసింది. ఇహాన్ సంధించిన బలమైన స్మాష్లకు నెహ్వాల్ వద్ద సమాధానమే లేకపోయింది.
'ఇహాన్ వాంగ్ కోర్టులో నా కన్నా వేగంగా కదిలింది. పాయింట్ల కోసం నేను చేసిన ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టింది. నెట్గేమ్, స్మాష్లతో ఎదురుదాడికి దిగడంతో నేనేమీ చేయలేకపోయాను. కోర్టులో చురుగ్గా కదల్లేకపోయాను. కీలక సమయాల్లో వరుస తప్పిదాలు చేశాను. గతంలో వాంగ్ ఈ స్థాయిలో ఆడడం చూడలేదు. 2016 ఒలింపిక్స్ గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే. ప్రస్తుతానికి కాంస్యం కోసం శనివారం జరిగే మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాను' అని సైనా నెహ్వాల్ తన ఓటమి గల కారణంపై చెప్పింది.