
ఢిల్లీ వీధుల్లో తిరగాలంటే భయమేస్తుందని సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ వేదికగా మంగళవారం ప్రారంభంకానున్న ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనేందుకు ఇక్కడికొచ్చిన హైదరాబాదీ సైనా రాజధానిలో మహిళలకు రక్షణ కరవైందని ఓ ఆంగ్ల టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వాపోయింది.
నిరుడు ఇక్కడికొచ్చినపుడు అత్యాచార సం ఘటన దేశాన్ని కుదిపేసిందని, ఇప్పుడు కూడా మరో దారుణం జరగడం విచారకరమని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృ తం కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని అన్నది. అత్యాచార వార్తలు విన్నపుడల్లా ఆందోళన కలుగుతోందని సైనా అన్నది.
ఢిల్లీ రోడ్లపై ఒంటరిగా వెళ్లాలన్న ఆలోచన వస్తే తన విషయంలోనూ ఇలా జరుగుతుందేమోనని భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి ఢిల్లీ అందమైన నగరమని, ఇలాంటి సంఘటనలు రాజధాని ప్రతిష్టను మసకబారుస్తున్నాయని సైనా వ్యాఖ్యానించింది.