న్యూఢిల్లీ: తెలుగు తేజం పివి సింధు త్వరలో జరిగే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబియల్)లో హైదరాబాదుకే చెందిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో సమరానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుని సింధు మంచి ఊపు మీద ఉంది.
తన తదుపరి లక్ష్యం ఐబియల్లో సత్తా చాటడమని సింధు చెప్పింది. మెరుగైనా ఆట ప్రదర్శించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని అంది. భారత నెంబర్ వన్ సైనాతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. సైనా హైదరాబాద్ తరఫున, సింధు లక్నో ఫ్రాంచైజీ తరఫున ఐబియల్లో బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరి మధ్య ఈ నెల 15వ తేదీన డిడిఎ బ్యాడ్మింటన్ స్టేడియంలో పోరు జరగనుంది.

ప్రపంచ కప్ పోటీల్లో కాంస్యం సాధించిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 15 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. చైనాలో సింధు చూపిన తెగువ ప్రశంసనీయమని, అందుకే ఆమెకు రూ. 15 లక్షల నజరాను ప్రకటించామని బాయ్ తెలిపింది. అంతర్జాతీయ పోటీల్లో మంచి ఫలితాలు సాధించిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ముందుంటామని చెప్పింది. వారికి కేవలం సన్మానాలు చేయడానికే పరిమితం కాకుండా నగదు సహాయం కూడా ఉంటుందని తాము చెప్పదలుచుకున్నట్లు బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.
ప్రపంచ కప్ పోటీల్లో కాంస్యం సాధించిన సింధను కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. అద్భుతమైన ప్రదర్శన చూపినందుకు ఆయన సింధును అభినందించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్, క్రీడాశాఖ కార్యదర్సి లవ్ అగర్వాల్, శాప్ ఎండి రాహుల్ బొజ్జా కూడా సింధును అభినందించారు.