సైనా 'వహ్వా'ల్
హైదరాబాద్ స్టార్ షట్లల్ సైనా నెహ్వాల్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్)లో అనూహ్య ధర పలికింది. ఆమెను పివిపి గ్రూప్కు చెందిన హైదరాబాద్ హాట్ షాట్స్ రూ.71 లక్షలకు కొనుగోలు చేసింది. ' నా హోమ్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. నేనెప్పుడూ హైదరాబాద్కు గానీ, లఖ్నవ్కు గానీ ఆడాలని అనుకున్నాను. అయితే వేలంలో హైదరాబాద్ నన్ను దక్కించుకుంది. ఇది మంచి వార్త. ఐబీఎల్లో నా జట్టును గెలిపించడానికి ప్రయత్నిస్తాన'ని సైనా తెలిపారు.
జ్వాలా నిరాశ
డబుల్స్ స్టార్ జ్వాలా గుత్తాను ఢిల్లీ స్మాషర్స్ రూ.18.5 లక్షలకు కొనుగోలు చేసింది. తక్కువ ధర పలకడంతో జ్వాలా గుత్తా నిరాశ పడ్డారు. 'తాను చాలా నిరాశ చెందానని, తాను, అశ్వినిలు దిగ్గజ హోదాతో ఒప్పందాలపై సంతకం చేశామని, కాబట్టి తమకు మరింత మెరుగైన ఒప్పందాలివ్వాల్సి ఉందని చెప్పారు. తమ కనీస ధరను తగ్గించారని కూడా తమకు సమాచారమివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశార'ని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగాకు కశ్యప్
హైదరాబాదుకు చెందిన పారుపల్లి కశ్యప్ను బంగా బీట్స్ రూ.44.8 లక్షలకు దక్కించుకుంది. 'హైదరాబాద్ జట్టును నన్ను దక్కించుకుంటే బావుండేది. ఎందుకంటే అది నా హోం జట్టు. మ్యాచ్లన్నీ గచ్చీబౌలిలో జరుగుతాయి. మా ఇల్లు కూడా అక్కడే ఉంద'ని కశ్యప్ అన్నాడు.
లీ చాంగ్ వి
ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు లీ చాంగ్ విని ముంబై మాస్టర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అతనిని రూ.80.6 లక్షలకు ముంబై జట్టు కొనుగోలు చేసింది. అత్యధిక ధర పలికిన వారిలో సైనా కంటే లీ చాంగ్ వీ ఒక్కరే ముందు ఉన్నారు.
సునీల్ అండ్ నాగ్
సునీల్ గవాస్కర్, అక్కినేని నాగార్జున, చాముండేశ్వరీనాథ్ల సంయుక్త భాగస్వామ్యంలోని ముంబై మాస్టర్స్ వేలంలో అత్యధిక ధరతో క్రీడాకారుడిని కొన్నుకున్న ఫ్రాంచైజీగా నిలిచింది. లీ చాంగ్ విను ఎనభై లక్షల రూపాయలకు పైగా పెట్టి కొన్నది.
సింధు అదుర్స్
పివి సింధును లక్నో వారియర్స్ రూ.47.8 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే జట్టు గురుసాయిదత్ను రూ.24 లక్షలకు, కె.శ్రీకాంత్ను ర.20.3 లక్షలకు, నందగోపాల్ను రూ.6 లక్షలకు, రుత్విక శివానిని రూ.1.8 లక్షలకు కొనుగోలు చేసింది.
గుత్తా జ్వాలా లాగే అశ్వినికీ..
అశ్విని పొన్నప్పను పుణే పుస్టన్స్ రూ.15 లక్షలకు కొనుగోలు చేసింది. గుత్తా జ్వాల, అశ్వినిలకు దిగ్గజ హోదా ఇచ్చి కనీస ధర రూ.30 లక్షలుగా నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత మహిళల డబుల్ ఈవెంట్ తొలగించి, సింగిల్స్ను చేర్చారు. దీంతో వారి కనీస ధర రూ.15 లక్షలుగా చేశారు.