లండన్ ఒలింపిక్స్లో ఫిక్సింగ్కు పాల్పడిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులపై ఆరోపణలు రావడంతో క్రీడల నిర్వాహక కమిటీ ఎనిమిది మంది మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులపై బహిష్కరణ వేటు వేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో దక్షిణ కొరియాకు చెందిన రెండు టీమ్లు, చైనా, ఇండోనేషియా టీమ్ల ప్రమేయం వున్నట్లు నిర్ధారణ అయిందని దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించింది.

ఈ సందర్బంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛీప్ తన క్షమాపణలను తెలియజేశాడు. ఒలింపిక్స్ నుండి బహిష్కరణకు గురైన క్రీడాకారులందరూ ప్రపంచ డబుల్స్లో ఛాంపియన్స్. లండన్ ఒలింపిక్స్ను ఈ ఫిక్సింగ్ ద్వారా కళంకితం చేసినందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ తీవ్రంగా మండిపడింది. బహిష్కరణకు గురైన వారిలో చైనాకు చెందిన వాంగ్ జియా ఓలి, యుయాంగ్, దక్షిణ కొరియాకు చెందిన జంగ్క్యున్ యున్, కిమ్ హానా, హా జంరు యున్, కిమ్మిన్ జంగ్, డోనేసియాకు చెందిన మీలానా జవహరి, గ్రేషియా పోలీ తదితరులు ఉన్నారు.
చైనాకు చెందిన యుయాంగ్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ టెన్సెంట్లో ఇది నా చివరి కాంపిటేషన్. గుడ్ బై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, నా ప్రియమైన బ్యాడ్మింటన్కు గుడ్ బై అంటూ ట్వీట్ చేసింది. నాకౌట్ పద్ధతికి బదులు రౌండ్ రాబిన్ పద్ధతిని ప్రవేశపెట్టటమే ఈ మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రధాన కారణమని తెలుస్తోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక గేమ్ ఓడిపోతే తరువాతి రౌండ్లో దానిని వదులుకోవాల్సి వుంటుంది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ థామస్ లుండ్ మీడియా కాన్సరెన్స్లో మాట్లాడుతూ ఐమాయ్ వెరీ వెరీ స్వారీ. ఇది ప్లేయర్స్కు మాత్రమే అవమానం కాదు.. ఒలంపిక్ క్రీడలకు కూడా అని అన్నారు. అందరూ ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకోని ఫిక్సింగ్కు పాల్పడిన ఎనిమిది మందిని బహిష్కరించామన్నారు. ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలను అన్నింటిని న్యాయమైన పద్ధతిలో విచారించాలి.
చైనా బ్యాడ్మింటన్ టీమ్ హెడ్ కోచ్ లి యాంగ్బో చైనా మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్స్ కాంపిటేషన్లో చైనాకు చెందిన వాంగ్ జియా ఓలి, యుయాంగ్ విజయవంతం కాలేకపోవడానికి తానే బాధ్యత వహిస్తున్నానని అన్నాడు. హెడ్ కోచ్గా చైనీస్ టీవి ఆడియన్స్ని నిరాశ పర్చినందుకు అందరికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేషనల్ టీమ్ తరుపున పాల్గోన్న చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలు వారియొక్క ఆత్మ పోరాటంలో విఫలమయ్యారని అన్నాడు.
మ్యాచ్ గెలిచేందుకు స్వశక్తిని ఉపయోగించకుండా క్రీడా రంగానికే అవమానకరమైన రీతిలో ప్రవర్తించినందుకే వీరిని శిక్షిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రతినిధి మార్క్ ఆడమ్స్ మాట్లాడుతూ ఒలింపిక్స్ ప్రమాణాలకు ఇటువంటి ప్రవర్తన ఏ మాత్రమూ సరిపడదని స్పష్టం చేశారు. అయితే ఈ శిక్షపై తాము అప్పీల్ చేయనున్నట్లు ఇండోనేషియా టీమ్ నేత ఎరిక్ తాహిర్, దక్షిణ కొరియా టీమ్లు చెప్పాయి.
తాము ఈ అవకాశాన్ని కోల్పోవటానికి చైనా క్రీడాకారులే కారణమని ఇండోనేసియా టీమ్ నేత తాహిర్ ఆరోపించారు. ఇదిలా వుండగా నాలుగు జట్లను ఒలింపిక్స్ నుండి బహిష్కరించాలన్న ఫెడరేషన్ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు క్రెయిగ్ రీడి స్వాగతించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది చైనా,ఇండోనేసియా, దక్షిణ కొరియా క్రీడాకారిణులపై తదుపరి చర్యలు తప్పవని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) అధ్యక్షుడు జాక్వెస్ రోగ్ తెలిపారు. ఫిక్సింగ్ కు పాల్పడిన నాలుగు జోడీలను ఒలింపిక్స్ నుంచి బహిష్కరిస్తూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
తెలుగు వన్ఇండియా