హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ ఘనంగా సత్కరించారు. ఇటీవల శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిదాంబి శ్రీకాంత్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అభినందించారు. శ్రీకాంత్తో పాటు కోచ్ గోపీచంద్ను కూడా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

భవిష్యత్తులో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను శ్రీకాంత్ కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. శ్రీకాంత్ సాధించిన వరుస విజయాలతో దేశం ఎంతో గర్విస్తోందని అన్నారు.
విజయ్ గోయల్ క్రీడలకు ఇస్తోన్న మద్దతుతో భారత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తోందని శ్రీకాంత్ తన ట్విటర్ ద్వారా మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంటే శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్ మణీనగర్లో అత్యాధునిక వసతులతో కూడిన ట్రాన్స్స్టేడియా ఎరీనాను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రజలంతా క్రీడలకు మద్దతిచ్చే సంస్కృతిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే రెండు సూపర్ సిరిస్లు సాధించిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు.