
మానసికంగా కూడా చాలా ఫిట్గా ఉన్నట్టు జ్వాల చెప్పింది. నిరుడు లండన్లో ఆడటం తనకి కలిసొస్తుందని ఆమె భావిస్తోంది. 'నేనెందుకు మెడల్ను ఆశించకూడదు? లండన్లోని అవే కోర్టులపై నిరుడు కాంస్యం గెలిచాను. నాకు అక్కడి పరిస్థితులన్నీ బాగా తెలుసు. ఇవన్నీ నాకు అనుకూలమైన స్థితిని కల్పిస్తాయి' అని జ్వాల చెప్పింది. ఒలింపిక్స్ పోటీల సమయం ఆసన్నమైన ఈ సమయంలో మదిలో ఎలాంటి ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయని ప్రశ్నించగా.. ఇంకా ఒలింపిక్స్ ఫీల్ రాలేదని, బహుశా పోటీలు ప్రారంభమైన తర్వాతే అలాంటి ఫీల్ వస్తుందేమోనని చెప్పింది. 'పెటా'లో సెలబ్రిటి సభ్యత్వం తీసుకున్న తర్వాత జూలలో జంతువులు పడుతున్న బాధలు గురించి వివరించింది.
జంతు ప్రదర్శనలో జంతువులను ఎప్పుడూ బోనుల్లో బంధించే ఉంచుతారని లేదా గొలుసులతో కట్టేస్తారని చెప్పింది. ఇలాంటివి జంతువుల సహజ జీవనానికి వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేసింది. జంతు ప్రదర్శనశాలల్లో ఏనుగులను బంధించడాన్ని 2009లో సెంట్రల్ జూ అథారిటీ నిషేధించింది. దేశంలోని ఇతర జూలు ఏనుగులను అడవులకు తరలిస్తున్నా హైదరాబాద్ జంతుప్రదర్శన శాల మాత్రం అలాంటి చర్యలు చేపట్టడంలేదని ఆమె ఆరోపించారు. చిన్నప్పుడు జంతు ప్రదర్శనశాలకు వెళ్లానని ఇప్పుడు వెళ్లడంలేదని జ్వాల తెలిపింది.
భారత్లోని జంతుప్రదర్శనశాలలను చూస్తే ఎంతో బాధగా ఉంటుందని, వాటిని సరైన పద్ధతిలో నిర్వహించడం లేదనే విషయం బయట నుంచి చూస్తేనే అర్థమవుతోందని చెప్పింది. ఈ దుర్భర స్థితిని మార్చేందుకు అందరూ నడుం బిగించాలని జ్వాల పిలుపునిచ్చింది. తానుకూడా జంతు ప్రేమికురాలినని, ఇంట్లో రెండు కుక్కలను పెంచుతున్నానని తెలిపింది. పెటా మంచి కార్యక్రమాలు చెస్తున్నందునే ఆ సంస్థకు మద్దతిస్తున్నానని జ్వాల చెప్పింది.