
2000 సిడ్నీ ఒలింపిక్స్లో ప్రి క్వార్టర్లోనే ఓడిన గోపీచంద్, భవిష్యత్తులో ఒలింపిక్ గెలిచే సత్తా ఉన్న షట్లర్లను తీర్చి దిద్దాలని నిర్ణయించుకోని హైదరాబాద్లో గోపించంద్ అకాడమీని స్దాపించి.. అందులో భాగంగానే సైనాను తీర్చిదిద్దారు. ఆటగాడిగా మిగిలిపోయిన లక్ష్యాలను కోచ్లుగా మారి సాధించినవారు చాలా మంది కనిపిస్తారు. గోపీచంద్ కూడా ఇప్పుడు అదే చేసి చూపించారు.
2006లో గోపీచంద్ అకాడమీలో చేరే నాటికి చిన్న విజయాలతో ఉన్న సైనాను గోపీచంద్ సానబెట్టి అధ్బుతంగా తీర్చిదిద్దారు. గురువు పర్యవేక్షణలో సైనా లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణ, డైట్, ఫిట్నెస్, మానసిక దృఢత్వం...ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా సైనా ప్రతీ విజయంలో ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మాటల కోచ్గానే మిగిలి పోకుండా గోపీ చంద్ గంటల పాటు సైనాతో కలిసి స్వయంగా ప్రాక్టీస్ చేయడం ఆ అమ్మాయి ఆటను మెరుగు పర్చడంలో ఎంతో ఉపకరించింది. పరాజయాలు ఎదురైనప్పుడు ర్యాంకు దిగజారినప్పుడు కూడా సైనాలో స్థైర్యం నింపిన కోచ్, ఒలింపిక్స్ లక్ష్యంగానే శ్రమించారు.
గతయేడాది అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత అంశాల కారణంగా గోపీచంద్ వద్ద ప్రాక్టీస్ చేయలేనంటూ, కోచ్గా భాస్కర్ బాబు ఉండాలంటూ సైనా నెహ్వాల్ ఏకంగా 'బాయ్'కే లేఖ రాసింది. దీనిని ఊహించని గోపి కూడా సైనాను ఆమె అభిప్రాయానికే వదిలేయడంతో దాదాపు మూడు నెలల పాటు వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఐతే సైనా తెలివిగా గురువు గోపీచంద్ లేకుండా ఒలింపిక్ మెడల్ సాధించడం కష్టం అనుకుందో ఏమో తెలియదు గానీ తిరిగి మళ్లీ తన గురువు దగ్గరకే చేరింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ఉన్న కోచ్ నిరభ్యంతరంగా ఆమెను మళ్లీ ప్రోత్సహించి ఒలింపిక్ పతకం సాధించడంతో కోచ్గా తన వంతు సహాయం అందించాడు.
ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించిన అనంతరం సైనా నెహ్వాల్ మాట్లాడుతూ గతంలో ఇలా నేనెప్పుడూ గెలవలేదు. బహుశా... ఈ పతకం నాకే రాసిపెట్టి ఉందేమో. ఒలింపిక్ మెడల్ నా ఖాతాలో చేరాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. పోడియంలో జాతీయ పతాకాన్ని చూడాలన్నది నా కల. ఇప్పుడు ఆ స్వప్నం నిజమైంది. పతకం గెలిచిన విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. బ్యాడ్మింటన్లో భారత క్రీడాకారిణి పతకం గెలుస్తుందని ఏనాడు ఊహించలేదు. ఎందుకంటే ఇందులో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒలింపిక్స్ కోసం చాలా శ్రమించా.
అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ నాకు అత్యంత కీలకమైంది. కానీ సెమీస్లో ఎందుకలా ఓడానన్న ఆలోచనలే నన్ను చుట్టుముడుతున్నాయి. మ్యాచ్లోకి దిగాక మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించా. జిన్ అలసిపోవడం నాకు కలిసొచ్చింది. తొలుత విశ్రాంతి అడుగుతుందేమోనని భావించా. ఆమెకు గాయమైన విషయాన్ని తర్వాత గుర్తించా. ఇది నిరాశ కలిగించే అంశమే అయినా... ఒక్కసారి లయ దొరికితే జిన్ను ఓడిస్తాననే నమ్మకం మాత్రం ఉంది. సహజసిద్ధమైన గేమ్ను ఆడా. సెమీస్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినా ఫలితం అనుకూలంగా రాలేదు. ఏదేమైనా ఈ పతకం చాలా ఉత్సాహాన్నిస్తోందని చెప్పింది.
ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించినందుకు గాను సైనా నెహ్వాల్కు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడా కోటి రూపాయల నజరానా ప్రకటించారు. సైనా నెహ్వాల్ స్వస్థలం హర్యానా రాష్ట్రం కావడంతో ఆయన ఈ నజరానా ప్రకటించారు.
తెలుగు వన్ఇండియా