
ప్రభుత్వం భూమిని విరాళంగా ఇచ్చిందని, భారత స్పోర్ట్స్ అథారిటీ నుంచి నిధులు వస్తున్నాయని, అయినా గోపిచంద్ అకాడమీ యువ క్రీడాకారుల నుంచి పెద్ద యెత్తున డబ్బులు వసూలు చేస్తోందని ఆమె అన్నారు. అకాడమీ పూర్తిగా వ్యాపారపరంగా నడుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అకాడమీలో శిక్షణ పొందినవారినే టోర్నమెంట్స్కు ఎంపిక చేస్తున్నారని ఆమె అన్నారు. టాప్ ఐదుగురు ఆటగాళ్లలో ఒకరు తనకు తెలుసునని, అతను ఎల్పీ స్టేడియం నుంచి రావడం వల్ల నేషనల్స్కు పంపించలేదని ఆమె అన్నారు.
గోపీచంద్ను కోర్టుకు లాగిన ముంబై క్రీడాకారిణి ప్రజాక్తా సావంత్కు జ్వాలా గుత్తా మద్దతుగా నిలిచారు. హైదరాబాదులోని అఖిల భారత జాతీయ శిక్షణఆ శిబిరంలో తాను పాల్గొనకుండా గోపీచంద్ తనను మానసికంగా హింసించారని ఆమె కోర్టుకు ఎక్కింది. అకాడమీలో శిక్షణ పొందినవారికే ప్రాధాన్యం ఇస్తూ తన కెరీర్ను దెబ్బ తీయడానికి గోపీచంద్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బంధువే అయినప్పటికీ గోపిచంద్తో జ్వాలాకు ఎప్పుడు కూడా సత్సంబంధాలు లేవు. జాతీయ మాజీ చీఫ్ కోచ్ సయ్యద్ మొహమ్మద్ అరిఫ్ నేతృత్వంలో ఆమె ఎల్బీ స్టేడియంలో శిక్షణ తీసుకుంటుంది. అరిఫ్కు అకాడమీని స్థాపించే అవకాశం వచ్చిందని, అయితే ఎప్పుడూ దాన్ని వ్యాపారం చేయలేదని జ్వాలా అన్నారు. మధ్యతరగతి పిల్లలు బ్యాడ్మింటన్ కోసం డబ్బులు వెచ్చించే స్థితిలో లేరని, యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆమె అన్నారు. ప్రైవేట్ అకాడమీలకు తాము ఎందుకు డబ్బు చెల్లించాలని ఆమె అడిగారు.