న్యూఢిల్లీ, జులై 20: జులై 27 నుండి ప్రారంభం కానున్న లండన్ ఒలంపిక్స్ బ్యాడ్మింటన్లో పతకం సాధించే అవకాశాలు సైనా నెహ్వాల్కి ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్లో పాపులారిటీని సంపాదించుకోవడంలో మాత్రం జ్వాలా గుత్తాతో పోల్చితే వెనుకంజలోనే ఉంది. అసలు విషయం ఏమిటంటే గత వారం సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 'గూగుల్ ఇన్ సైట్స్ సెర్చ్' పేరు మీద ఆన్ లైన్లో భారత క్రీడా రంగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ముగ్గురు మహిళా క్రీడాకారిణిలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల మధ్య నిర్వహించిన పాపులారిటీ సర్వేలో సైనా నెహ్వాల్తో పోల్చితే జ్వాలా గుత్తా ముందంజలో ఉంది.
పాపులారిటీ విషయంలో జ్వాలా గుత్తాకు 80 శాతం రాగా, సైనా నెహ్వాల్కి 64 శాతం మాత్రమే లభించింది. ఐతే ఓవరాల్గా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా 84 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. భారత క్రీడా రంగంలో గ్లామరస్ క్వీన్గా సానియా మిర్జాకే అభిమానులు పట్టం కట్టారు. మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, సోమ్దేవ్ తదితరులను వెనక్కి నెట్టి సానియా పాపులారిటిలో ప్రథమ స్థానంలో నిలిచింది. లండన్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల్లో కూడా అత్యధిక మంది అభిమానులను ఆకర్షిస్తున్న క్రీడాకారిణిగా కూడా సానియానే నిలిచింది. జ్వాలా రెండో స్థానాన్ని దక్కించుకోగా... సైనా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది.
తెలుగు వన్ఇండియా