ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో సతమతం అయిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి చేతులెత్తేసింది. ఇప్పటికే టాప్ టెన్లో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆమె.. ఈ సీజన్లో తొలిసారి ఓ టోర్నీలో ఫైనల్ చేరి టైటిల్పై ఆశలు రేపింది. కానీ చివరకు ఫలితం మాత్రం మారలేదు. స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300లో కూడా పీవీ సింధు ఓటమిపాలైంది. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్ మెడల్తో సరిపెట్టుకుంది.
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను సింధు పాజిటివ్గా మొదలు పెట్టింది. క్వార్టర్ ఫైనల్స్లో కిడాంబి శ్రీకాంత్ కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీలో భారత్ నుంచి కేవలం సింధు మాత్రమే పోటీలో నిలిచింది. ఆమె సెమీఫైనల్లో అద్భుతంగా పోరాడి ఫైనల్ చేరడంతో అభిమానుల్లో టైటిల్ ఆశలు రేగాయి. ఈ సీజన్లో సింధు తొలి టైటిల్ అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఆశలేవీ నెరవేరలేదు.

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇండోనేసియా స్టార్ గ్రెగోరియా మారిస్కా టున్జంగ్ చేతిలో సింధు చిత్తుగా ఓడింది. టోర్నీలో రెండో సీడ్గా ఉన్న సింధుపై గ్రెగోరియా 21-8, 21-8 తేడాతో వరుస సెట్లలో నెగ్గి స్పెయిన్ మాస్టర్స్ చాంపియన్గా అవతరించింది. ఈ ఫలితాన్ని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఏడుసార్లు తలపడగా ప్రతిసారీ సింధునే విజయం సాధించింది.
కానీ ఈసారి మాత్రం చరిత్ర తిరగరాసిన గ్రెగోరియా.. సింధును తొలిసారి ఓడించడంతోపాటు స్పెయిన్ మాస్టర్స్ టైటిల్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో ఈ ఏడాది సింధు టైటిల్ వేట మరింత ఆలస్యం అయింది. సెమీఫైనల్లో సింగపూర్ ప్రత్యర్థి యో జియా మిన్ గట్టి పోటీ ఇచ్చినా కూడా.. తనదైన స్టైల్లో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో ఆమె మళ్లీ తన బెస్ట్ ఫామ్ అందుకుందని, ఈసారి టైటిల్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరకు ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.