సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మ్యాచ్లలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ సత్తా చాటాడు. రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించడంతో టోర్నమెంట్ మెయిన్ 'డ్రా'కు కశ్యప్ అర్హత సాధించాడు. ర్యాంకింగ్స్లో దిగువన ఉండటంతో కశ్యప్ మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాడు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 21-5, 14-21, 21-17తో మలేసియాకు చెందిన చిమ్ జున్ వీపై గెలుపొందాడు. ఇక రెండో రౌండ్లో 15-21, 21-16, 22-20తో జపాన్ ఆటగాడు యు ఇగరషిపై కశ్యప్ విజయం సాధించాడు. బుధవారం జరిగే మెయిన్ డ్రా తొలి మ్యాచ్లో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో కశ్యప్ తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్లో షట్లర్ ముగ్ధా ఆగ్రే కూడా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్లో 16-21, 21-14, 21-15తో లారెన్ లామ్ (అమెరికా)పై గెలుపొందింది. ఈ రోజు జరిగే మెయిన్ డ్రా తొలి మ్యాచ్లో పోర్న్పవి చొచువాంగ్ (థాయ్లాండ్)తో ముగ్ధా పోటీపడనుంది.
మరోవైపు పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో అర్జున్-శ్లోక్ రామచంద్రన్ ద్వయం 11-21, 18-21తో కిమ్ అస్ట్రప్-అండర్స్ స్కారప్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడింది. ఇక బుధవారం జరిగే మెయిన్ డ్రా పోటీల్లో భారత స్టార్లు షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు అమితుమీ తేల్చుకోనున్నారు.