సింగపూన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ గాయత్రి గోపించంద్-ట్రీసా జాలీ పోరాటం ముగిసింది. సంచలన విజయాలతో సెమీ ఫైనల్స్కు దూసుకొచ్చిన గాయత్రి జోడీ కీలక పోరులో తడబడింది.శనివారం జపాన్ జోడీ నమి మత్సుయామ-చిహారు షిదాతో జరిగిన సెమీస్లో 21-23, 11-21 తేడాతో ఓడింది.
వరుస రెండు గేమ్ల్లో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే 30వ ర్యాంక్ అయిన గాయత్రి జోడి ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట నమి మత్సుయామ-చిహారు షిదాకు తొలి గేమ్లో గట్టిపోటీ ఇచ్చింది. ఓ దశలో 10-14తో వెనుకంజలో ఉన్న గాయత్రి-ట్రీసా ఆ తర్వాత గొప్పగా పుంజుకుని స్కోరును 21-21తో సమం చేసింది.

కానీ అదే జోరును ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది.పాయింట్లు చేజార్చుకుని మొదటి గేమ్ కోల్పోయింది.రెండో గేమ్ ఆరంభం నుంచి గాయత్రి జోడి నిరాశపరిచింది. 2-11, 4-19 స్కోర్లతో ఆదిలోనే ఓటమి దిశగా సాగింది. ఆ తర్వాత గాయత్రి-ట్రిసా పోరాటం మ్యాచ్ను మరికాసేపు పొడగించడానికే ఉపయోగపడింది. అయితే ఈ వారంలో గాయత్రి చేసిన పోరాటం అద్వితీయం.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకు దక్షిణ కొరియా ద్వయం బేక్ హా-లీ సోని 21-9, 14-21, 21-15తో ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో ర్యాంక్ జంట, దక్షిణ కొరియాకు చెందిన సో యోంగ్- కాంగ్ హీ యోంగ్ జోడీని 18-21, 21-19, 24-22కు షాక్ ఇచ్చి సెమీస్కు దూసుకొచ్చింది. కానీ కీలక పోరులో అదే జోరును కొనసాగించలేకపోయింది.