సింగపూన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ గాయత్రి గోపించంద్-ట్రీసా జాలీ మరో సంచలన విజయం సాధించారు. గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకును మట్టికరిపించిన గాయత్రి జోడీ శుక్రవారం ఆరో ర్యాంక్ జంటకు షాక్ ఇచ్చింది. మహిళల డబుల్స్లో క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో యోంగ్- కాంగ్ హీ యోంగ్ జోడీని 18-21, 21-19, 24-22 తేడాతో ఓడించి సెమీస్ దూసుకెళ్లింది.
79 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా కొనసాగింది. తొలి గేమ్లో ప్రత్యర్థి జంట విజయం సాధించింది. అయితే గాయత్రి జోడీ గట్టిగానే పోరాడింది. రెండో గేమ్ ఉత్కంఠగా సాగింది. ఓ దశలో భారత షట్లర్ల ఓటమి దాదాపు ఖాయమే అనే పరిస్థితి ఎదురైంది. 12-18 పాయింట్లతో గాయత్రి-ట్రీసా వెనుకంజలో నిలిచారు. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకున్నారు. వరుసగా అయిదు పాయింట్లు సాధించి పోటీలోకి తిరిగొచ్చారు.

మరోవైపు కొరియా జంట కూడా ప్రతిఘటించడంతో గేమ్ ఉత్కంఠగా మారింది. 17-19తో భారత్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. ఈ దశలో గాయత్రి జోడి ఒత్తిడి జయిస్తూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక ఆఖరి గేమ్ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆఖర్లో స్కోర్లు సమంగా సాగాయి. కానీ కీలక దశలో గాయత్రి-ట్రీసా ఎలాంటి పొరపాటు చేయకుండా గేమ్ను గెలిచి మ్యాచ్ను ముగించింది.
గతేడాది ఏషియన్ గేమ్స్లో ఈ కొరియా జంట సో యోంగ్- కాంగ్ హీ యోంగ్ చేతిలో గాయత్రి జోడీ ఓటమిపాలైంది. కానీ సింగపూర్ ఓపెన్లో గెలిచి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కాగా, శనివారం జరిగే సెమీ ఫైనల్స్లో జపాన్ జోడీ నమి మత్సుయామ-చిహారు షిదా తో గాయత్రి-ట్రీసా తలపడనుంది.