సింగపూన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ గాయత్రీ గోపించంద్-ట్రీసా జాలీ సంచలనం సృష్టించారు. ప్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకు జోడీకి షాక్ ఇచ్చారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్లో దక్షిణ కొరియా ద్వయం బేక్ హా-లీ సోని గాయత్రీ జంట 21-9, 14-21, 21-15తో మట్టికరిపించిది. ఈ ఘన విజయంతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
తొలి గేమ్లో గాయత్రీ ద్వయం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా పాయింట్లతో హోరెత్తించింది. కానీ రెండో గేమ్లో బేక్ హా-లీ సో పుంజుకున్నారు. గాయత్రీ-ట్రీసాపై పైచేయి సాధించి రెండో గేమ్ను సొంతం చేసుకున్నారు. ఇక నిర్ణయాత్మక ఆఖరి గేమ్లో గాయత్రీ జోడీ ఎలాంటి పొరపాటు చేయకుండా విజయాన్ని సాధించింది.

సింధుకు షాక్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోషాక్ తగిలింది. మహిళల సింగిల్స్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ప్రీక్వార్టర్స్లో 21-13, 11-21, 20-22తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కరోలినా చేతిలో సింధుకు వరుసగా ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం. 2018 తర్వాత కరోలినాపై సింధు గెలవలేకపోయింది. ఓవరాల్గా సింధు-కరోలినా ఇప్పటివరకు 17 సార్లు తలపడగా, తెలుగు తేజం అయిదు సార్లు విజయం సాధించింది.
ప్రణయ్ ఔట్
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ ఓటమి చవి చూశాడు. జపాన్ షట్లర్ కెంటా నిషిమొటోతో జరిగిన పోరులో 13-21, 21-14, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్ను చేజార్చుకున్నప్పటికీ రెండో గేమ్ను ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. గొప్పగా పోరాడి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ అదే జోరును నిర్ణయాత్మక గేమ్లో చూపించలేకపోయాడు.