సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ 2022 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్స్లో దుమ్ము రేపింది. తన ప్రత్యర్థి, చైనాకు చెందిన హాన్ యుయెను మట్టి కరిపించింది. తొలి సెట్ ఓడిపోయినప్పటికీ.. ఆ తరువాత ఆమె పుంజుకొన్న తీరు అద్భుతం. ఆ తరువాత వరుస సెట్లల్లో ప్రత్యర్థిని ఓడించింది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రణయ్ పోరాటం ముగిసింది. వారిద్దరూ ఓటమి పాలయ్యారు. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు.
Semifinals up for grabs as former champion Saina Nehwal 🇮🇳 rivals Aya Ohori 🇯🇵.#BWFWorldTour #SingaporeOpen2022 pic.twitter.com/HOITIf7b7r
— BWF (@bwfmedia) July 15, 2022
క్వార్టర్ ఫైనల్స్లో హాన్ యుయెను ఎదుర్కొన్న పీవీ సింధు తొలి సెట్ను 17-21 పాయింట్ల తేడాతో కోల్పోయింది. ఇక పుంజుకోవడం కష్టమనుకునే దశలో ఆమె బౌన్స్ బ్యాక్ అయింది. చివరి రెండు సెట్లల్లో ఆమెకు ఎదురు లేకుండాపోయింది. రెండో సెట్ను గెలుచుకున్న తీరు- సింధు దూకుడుకు అద్దం పట్టింది. ఈ సెట్లో హాన్ యుయె సాధించింది 11 పాయింట్లు మాత్రమే. 21-11 తేడాతో రెండో సెట్ను ముగించింది.
మూడో సెట్లో హాన్ యుయె తీవ్రంగా ప్రతిఘటించింది. ఒకదశలో పోటాపోటీగా పాయింట్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ, పరస్పరం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సింధు-హాన్ మధ్య హోరాహోరి పోరు సాగింది. గేమ్ తుది రౌండ్కు చేరుకున్నప్పుడు పీవీ సింధు ఒక్కసారిగా విజృంభించింది. వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. ఈ సెట్ను 21-19 పాయింట్లతో గెలుచుకుంది. సెమీ ఫైనల్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. హాన్ యుయె ఇప్పటివరకు మూడుసార్లు తలపడగా.. అన్ని మ్యాచ్లల్లోనూ సింధుదే పైచేయి.
సెమీ ఫైనల్స్లో ఆమె జపాన్కు చెందిన షట్లర్ సయీనా కవకమిని ఎదుర్కొంటుంది. ఈ ఏడాది మేలో జరిగిన థాయ్లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్స్లో ప్రవేశించిన తరువాత పీవీ సింధు మళ్లీ అలాంటి రికార్డును నెలకొల్పడం ఇదే తొలిసారి. ఈ నెల చివరి నుంచి బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్న నేపథ్యంలో పీవీ సింధు ఫుల్ ఫామ్లోకి రావడం శుభసూచకంగా చెప్పుకోవచ్చు. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రణయ్ పోరాటం ముగిసింది. నెహ్వాల్.. జపాన్కు చెందిన అయా ఒహొరి చేతిలో 21-13, 15-21, 22-20 సెట్ల తేడాతో ఓడిపోయింది.