హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్లో భారత షట్లర్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. శుక్రవారం రాత్రి జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో వీరిద్దరూ పరాజయం పాలయ్యారు. 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో మూడో సీడ్ సింధు చైనా క్రీడాకారిణి హె బింగ్జియావో చేతిలో 13-21, 16-21 తేడాతో ఓటమి చెందింది.
ఈ ఏడాది ఇదే ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం సింధుకు ఇది రెండోసారి. అదేవిధంగా పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ టాప్ సీడ్ జపాన్కు చెందిన కెంటో మొమోటో చేతిలో 16-21, 19-21 తేడాతో ఓడిపోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన వివిధ మ్యాచ్లలో ఇదే ప్రత్యర్థి చేతిలో శ్రీకాంత్ ఐదుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
ఇదిలావుండగా పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 12-21, 24-26తో టాప్సీడ్ మార్కస్ ఫెర్నాల్డి, కెవిన్ సంజయ (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది.
ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 20-22, 11-21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.