
హైదరాబాద్: దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అంచనాలకు తగ్గట్లే రాణిస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలోని గ్రూప్ 'ఎ' లీగ్ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21-13, 21-12తో సయాకా సాటో (జపాన్)ను చిత్తుగా ఓడించి సెమీస్కు చేరుకుంది.
36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధు 21-13, 21-12తో విజయం సాధించింది. తొలి గేమ్ సగం వరకు సింధుకు సయాకా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆరంభంలో 1-3తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 7-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత సింధు తన జోరుని మరింతగా పెంచింది. 15-11తో ఆధిక్యంలో ఉన్నపుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సింధు.. అదే ఊపులో గేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లోనూ సింధు అద్భుత ఆటతీరుని ప్రదర్శించింది.
విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో ఉన్న సింధు.. తర్వాత చెలరేగిపోయింది. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 19-7తో ముందంజ వేసింది. ఆ తర్వాత సాటోకు ఐదు పాయింట్లు కోల్పోయినా... ఏకాగ్రత కోల్పోకుండా విజయానికి అవసరమైన రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్ని ముగించింది.
ఈ ఏడాది సయాకా సాటోను రెండుసార్లు ఓడించిన సింధు మూడోసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇదే గ్రూప్లో సింధుతో పాటు యమగూచి రెండేసి విజయాలు సాధించగా.. బింగ్జియావ్, సయాకా రెండు మ్యాచ్లూ ఓడిపోయారు. దీంతో చివరి రౌండ్ మ్యాచ్లు మిగిలుండగానే సింధు, యమగూచి సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నారు.
శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన వారు గ్రూప్ టాపర్గా నిలుస్తారు. మరోవైపు గ్రూప్-బిలో సెమీస్ బెర్తులు ఇంకా తేలలేదు. గ్రూప్-బీలో రచనోక్ రెండు విజయాలతో సెమీస్కు చేరువ కాగా... తై జు యింగ్, యుఫీ చెన్ రెండేసి మ్యాచ్లు ఆడి చెరో విజయం సాధించారు.
హ్యున్ సంగ్ రెండు మ్యాచ్లూ ఓడింది. చివరి రౌండు ఫలితాల్ని బట్టి గ్రూప్-బీలో సెమీస్ చేరేదెవరో తేలుతుంది.
శ్రీకాంత్ ఓటమి
పురుషుల సింగిల్స్ గ్రూప్ 'బి'లో భారత స్టార్ శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో శ్రీకాంత్ 18-21, 18-21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలయ్యాడు.
43 నిమిషాలు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. అయితే మధ్యలో శ్రీకాంత్ తడబడటంతో 8-18తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకుని 18-20తో ప్రత్యర్థికి చేరువగా వచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయాడు. శుక్రవారం జరిగే నామమాత్రమైన మూడో లీగ్ మ్యాచ్లో షి యుకి (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు.
గురువారం జరిగిన మరో మ్యాచ్లో షి యుకి 13-21, 21-18, 21-17తో అక్సెల్సన్ను ఓడించి రెండో విజయంతో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నాడు. శ్రీకాంత్ తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.