హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సత్తాచాటిన భారత క్రీడాకారుల్ని శుక్రవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ సత్కరించారు. గ్లాస్కో వేదికగా ఇటీవలే ముగిసిన ఈ టోర్నీలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు రజతం సాధించగా, సైనా నెహ్వాల్ కాంస్యంతో మెరిసిన సంగతి తెలిసిందే.
జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన పైనల్లో తృటిలో పీవీ సింధు స్వర్ణాన్ని చేజార్చుకున్నప్పటీ ఆమె ఆటతీరు మాత్రం భారత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సింధు, సైనాతో పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఓపెన్లను గెలిచిన కిదాంబి శ్రీకాంత్లను కూడా విజయ్ గోయల్ సత్కరించారు.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ భారత్లో బ్యాడ్మింటన్కి ఆదరణ బాగా పెరుగుతోందని, ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో ఛాంపియన్స్ని తయారుచేయడం కష్టం కాదని తెలిపింది. ఇక వరల్డ్ ఛాంపియన్షిప్ రజత పతక విజేత పీవీ సింధు మాట్లాడుతూ
'ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు సుదీర్ఘంగా సాగింది. చివరి నిమిషం వరకూ జరిగే పోరాటాల్లో ఎవరైనా విజేతగా నిలవొచ్చు. ఆ మ్యాచ్లో ఒకుహరా చాలా బాగా ఆడింది' అని చెప్పుకొచ్చింది. ఇక ఇదే టోర్నీలో క్వార్టర్స్లోనే వెనుదిరిగిన శ్రీకాంత్ మాట్లాడుతూ 'గోపీ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ టోర్నీ నుంచి చాలా నేర్చుకున్నా' అని అన్నాడు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ గోయల్ సత్కారం అనంతరం పీవీ సింధు, కోచ్ గోపీచంద్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వారిని అభినందించారు.