
హైదరాబాద్: డిసెంబర్ 23న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ ఆరంభం కానుంది. మూడో సీజన్ తొలి మ్యాచ్ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో భాగంగా పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు సైనా నెహ్వాల్ నేతృత్వంలోని అవధె వారియర్స్ జట్టుతో తలపడనుంది.
మరోవైపు ఈ ఏడాది లీగ్లో కొత్తగా ప్రవేశించిన నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ సొంత గడ్డ గువాహటిలో తొలి అంచె పోటీలు జరగనున్నాయి. రెండోరోజు కరోలినా మారిన్ నేతృత్వంలోని హైదరాబాద్ హంటర్స్ను ఈస్ట్రన్ వారియర్స్ ఢీకొంటుంది. ఈసారి లీగ్ 23రోజుల పాటు జరగనుంది.
లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్లకు ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు రోజు ఒకటే మ్యాచ్ ఉండేలా నిర్వాహకులు షెడ్యూల్ని రూపొందించారు. ఈసారి లీగ్లో పురుషుల వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు బ్లాస్టర్స్), మహిళల టాప్ ప్లేయర్ తై జు ఇంగ్ (అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్)లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.