హైదరాబాద్: ఇంగ్లాండు సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో తెలుగు తేజం పివి సింధు ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఆమె నెంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. సింధు ఆమె చేతిలో 14-21, 10-21 స్కోరుతో చిత్తయింది.
తొలి గేమ్లో 10వ పాయింట్ వరకు ఆధిక్యం ప్రదర్శించిన సింధు ఆ తర్వాత ముందుకు సాగలేకపోయింది. రెండో గేమ్లో దాదాపుగా చేతులెత్తేసింది.
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాంఢ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)పై 21-12, 21-4 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది.

తద్వారా ఆమె క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ గేమ్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు అరగంటలోనే ఈ మ్యాచ్ను ముగించింది.
తొలి గేమ్ అర్ధభాగంలో 11-5తో ముందంజ వేసిన పీవీ సింధు ప్రత్యర్థిపై విరుచుకపడింది. 16 నిమిషాల్లోనే 21-12తో ఈ గేమ్ను ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్లో సింధుకు ఎదురులేకుండా పోయింది.