మకావు: మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్, భారత టీనేజ్ సంచలనం పివి సింధు నిలబెట్టుకుంది. ఈ సీజన్లో ఆమెకు ఇదే మొదటి టైటిల్. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో ఈ తెలుగు తేజం 21-12, 21-17 తేడాతో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది.
గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన సింధు ఫైనల్లో కిమ్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. సెమీస్లో చైనాకు చెందిన ఏడో సీడ్ యు సన్పై గెలిచి, టైటిల్ను అందుకునే అవకాశాలు తనకే ఉన్నాయని పరోక్షంగా హెచ్చరికలు పంపిన కిమ్ ఫైనల్లో సింధును తీవ్రంగానే ప్రతిఘటించింది.
అయితే, సింధు చక్కటి ప్లేసింగ్స్, స్మాష్లతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోడీ ఇండియన్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో సహచర క్రీడాకారిణి, మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ చేతిలో ఓటమిపాలైన సింధు మకావూ ఫైనల్లో అలాంటి ప్రమాదం ఎదురుకాకుండా జాగ్రత్త పడింది. వ్యూహాత్మకంగా ఆడి గెలిచింది.

ఆనందంగా ఉంది- సింధు
'ప్రత్యర్థి కిమ్ హో మిన్ మెరుగ్గా ఆడింది. ఫైనల్ చేరే క్రమంలో కిమ్ స్టార్ షట్లర్లను ఓడించింది. దీంతో టైటిల్ పోరులో ఆమెను ఓడించడం సులువు కాదని అర్థమైంది. వరుస గేమ్లు నెగ్గినా.. తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మూలాలకు కట్టుబడి ఆడాను. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నా. ఈ ఏడాది ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడల్లో స్టార్ షట్లర్లను ఓడించి పతకాలు సాధించా. అయితే కొన్ని పరాజయాలు బాధించాయి. వచ్చే ఏడాది కూడా అత్యుత్తమ ప్రదర్శనకు కృషి చేస్తా' అని సింధు తెలిపింది.
'ఈ ఏడాది మొత్తం సింధు నిలకడగా రాణించింది. ఈ టైటిల్ ఆమెకు ఎంతో ముఖ్యమైనది. మిషెల్లే లీ, బుసానన్ వంటి షట్లర్లను ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో సింధు వేగంగా కదిలింది. సీజన్ ముగింపులో ఆమెకు మంచి విజయం దక్కింది. ప్రణయ్ సెమీస్ చేరడం సానుకూలాంశం. కొంత కాలంగా యువ షట్లర్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. వారికి మంచి భవిష్యత్ ఉంది' అని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అన్నారు.
పురుషుల సింగిల్స్ టైటిల్ను 11వ సీడ్ సాంగ్ జూ సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అతను 6వ సీడ్ వాంగ్ వింగ్ కి వినె్సంట్ ను 16-21, 21-13, 21-19 తేడాతో విజయం సాధించాడు. మహిళల డబుల్స్ టైటిల్ను యాకియాంగ్ హువాంగ్ జాంగ్ క్వియాగ్జిన్ జోడీని 19-21, 21-19, 21-7 తేడాతో ఓడించిన ఒయు డాంగ్ నీ, జియాహాన్ యూ జోడీ దక్కించుకుంది.
పురుషుల డబుల్స్ ఫైనల్లో డానీ బవా క్రిస్టియాంటా, చాయుత్ ట్రియాచర్ట్ జోడీ 21-19, 22-20 ఆధిక్యంతో అగా ప్రతమా, రికీ కరాండా సువాద్రి జోడీపై గెలిచి టైటిల్ను అందుకుంది. కాగా, మిక్స్డ్ డబుల్స్లోనూ గెలిచి 'డబుల్ టైటిల్స్' సాధించాలన్న క్రిస్టియాంటాకు చుక్కెదురైంది. యు వాన్ వానెసాతో కలిసి బరిలోకి దిగిన అతను ఎదీ సుబక్తియార్, గ్లోరియా ఎమాన్యుయెల్లా విజాజా జోడీ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు.