టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్లో ఆరో రోజు భారత్.. మిశ్రమ ఫలితాలను చవి చూసింది. మహిళల హాకీలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పురుషుల అర్చరీ ఎలిమినేషన్ రౌండ్లో తరుణ్దీప్ రాయ్ ఓటమి పాలయ్యాడు. సెయిలర్లు కూడా ప్రభావాన్ని చూపలేకపోతోన్నారు. దాదాపు ఒక్కో ఈవెంట్లో భారత ప్రస్థానం ముగింపు దశకు వస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత ఆశాకిరణంలా మారారు.. పీవీ సింధు.
ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో బ్యాడ్మింటన్లో అదరగొడుతున్నారు. అలవోకగా విజయాలను సాధిస్తూ పతకం వైసు దూసుకెళ్తోన్నారు. ఈ ఉదయం జరిగిన గ్రూప్ దశ రెండో మ్యాచ్లో ఆరో సీడ్ పీవీ సింధు తడాఖా చూపారు. ప్రపంచ ర్యాంకింగ్లో 34వ స్థానంలో ఉన్న హాంకాంగ్ ప్లేయర్ ఛెయుంగ్ ఎన్గన్ యీపై ఏకపక్ష విజయాన్ని అందుకున్నారు. 21-9, 21-16 వరుస సెట్ల తేడాతో నెగ్గారు. ఈ విజయంతో తన పూల్లో పీవీ సింధు అగ్రస్థానాన్ని సుస్థిర చేసుకున్నారు.
హాకీలో భారత్కు పరాభవం: క్వార్టర్స్లో ఎంట్రీ కష్టమే: ఇలా చేస్తే గానీ..!
ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఆమె డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్ను ఎదర్కొనాల్సి ఉంది. ఈ మ్యాచ్లో కూడా పీవీ సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా- హాంకాంగ్ క్రీడాకారణితో జరిగిన ఈ మ్యాచ్లో పీవీ సింధు అసాంతం తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. తొలి సెట్ను అలవోకగా నెగ్గారు. సిందు ఆడిన డ్రాప్ షాట్లను ఛెయుంగ్ సమర్థవంతంగా అడ్డుకోలేకపోయారు. పొరపాట్లు చేశారు. వాటన్నింటినీ పీవీ సింధు సద్వినియోగం చేసుకున్నారు.
రెండో సెట్లో ఛెయుంగ్ ప్రతిఘటించారు. 6-6, 7-7,7-8.. ఇలా పీవీ సింధుతో పోటీ పడ్డారు. 13వ సెట్ వరకూ ఛెయుంగ్.. పీవీ సింధు ఆధిక్యాన్ని అదుపులో పెట్టారు. ఆ తరువాత సింధు రెచ్చిపోయారు. డ్రాప్ షాట్ల, ఫోర్ హ్యాండ్ షాట్లతో గుక్కతిప్పుకోనివ్వలేదు. పీవీ సింధుతో పోటీ పడలేకపోయారామె. 15-14 వద్ద ప్రారంభమైన సింధు ఆధిపత్యం చివరి వరకూ కొనసాగింది. ప్రతి సెట్లోనూ రెండేసి పాయింట్లను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి రెండో సెట్ను 21-16 తేడాతో సొంతం చేసుకున్నారు.