న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత శోభా డే మరోసారి నోరుపారేసుకున్నారు. ఇప్పటికే భారత ఒలింపిక్స్ క్రీడాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న శోభా డే తన పద్ధతిని మార్చుకోవడం లేదు.
సెల్ఫీలు దిగడం తప్ప మనవాళ్లకు పతకం పట్టుకురావడం తెలియదు అంటూ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రియో ఒలింపిక్స్లో భారత పతకాల ఆశలను సజీవంగా నిలిపిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం రాత్రి జరగనున్న టైటిల్ పోరులో సింధు విజయం సాధించి బంగారు పతకం సాధించాలని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు సింధు స్వర్ణ పతకంతో భారత్కు తిరిగి రావాలని కోరుకుంటుంటే.. శోభా డే మాత్రం అవమానకర రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
సింధు బంగారు పతకం సాధించలేదంటూ కాలమిస్ట్ శోభా డే వివాదాస్పద ట్వీట్ చేశారు. సింధును 'సిల్వర్ ప్రిన్సెస్' గా అభివర్ణిస్తూ శోభా డే చేసిన ట్వీట్ పై ప్రస్తుతం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నీకు ఇంకా బుద్ధి రాలేదా? అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.