ముంబై: ఒలింపిక్స్లో రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే.. తనపై నలువైపుల నుంచి విమర్శలు రావడంతో తన తప్పును తెలుసుకున్నట్లున్నారు. వెండి పథకాన్ని సాధించిన సింధు 24 కారెట్ల బంగారమని, ఆమె హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
ధైర్యశాలి సింధు నిజమైన హీరో అని ట్వీట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. '24 క్యారెట్ల బంగారమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము' అని పేర్కొన్నారు. అంతేగాక, పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మలిక్ విజయ గాథలను పోస్ట్ చేశారు.
సింధు జీవితంపై సినిమా తీయాలని, ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్లో నటించాలని అన్నారు. దీపిక కన్నా బాగా ఇంకెవరు నటిస్తారని వ్యాఖ్యానించారు.

భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృథా అని గంతంలో శోభా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'సిల్వర్ ప్రిన్సెస్' అంటూ ఫైనల్ చేరిన సింధును అవమానపరుస్తూ ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. దీంతో తన వైఖరి మార్చుకున్న శోభా డే సింధుతోపాటు ఒలింపిక్స్ క్రీడాకారులపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.