
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ప్లేయర్స్ సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టిలు 2019 సంవత్సరానికి గాను 'మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయ్యారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ఈ ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించింది.
ఈ ఏడాది వీరిద్దరి జోడీ ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో థాయ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 ఈవెంట్ ఫైనల్స్కు చేరి తృటిలో ట్రోఫీని మిస్సయ్యారు. ఇలా, ఈ ఏడాది వీరిద్దరి జోడి ఒక సీజన్లో ఎంతో పురోగతిని చూసింది.
ఇతర నామినీలలో కెనడా మహిళల సింగిల్స్ క్రీడాకారిణి మిచెల్ లి, కొరియా మహిళల డబుల్స్ జోడీ కిమ్ సో యోయాంగ్-కాంగ్ హీ యోంగ్... ఇండోనేషియా మిక్స్డ్ డబుల్స్ జోడీ ప్రవీణ్ జోర్డాన్-మెలాటి దేవా ఓక్టావియాంటిలు ఉన్నారు. ఈ ఏడాది బ్యాడ్మింటన్లో చేసిన ప్రదర్శనలకు గానూ బీడబ్ల్యూఎఫ్ ఆటగాళ్లను అవార్డులతో సత్కరించింది.
కాగా, ఇండియా మేల్ పారా బ్యాండ్మింటన్ ఆటగాడు ప్రమోద్ భగత్కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. పారా బ్యాడ్మింటన్లో రెండుతో సహా మొత్తం ఆరు విభాగాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తున్నారు. భారత్కు చెందిన మహిళా, పురుష సింగిల్స్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా ఈ అవార్డుల జాబితాలో చోటు దక్కలేదు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచినప్పటికీ నామినేషన్లలో పేరు లేకపోవడం విశేషం. మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ వుమెన్ సింగిల్స్గా మిచెల్ లి(కెనడా), సింగిల్స్ మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మెన్స్గా కెంటో మొమొటో అవార్డులను గెలుచుకున్నారు.