ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ షెట్టి మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కు టైటిల్ అందించారు.. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఈ ద్వయం ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆసియా ఛాంపియన్షిప్లో భారత్కు ఇప్పటి వరకు స్వర్ణ పతకం లేదు.
ఈ పతకం కోసం భారత్ 58 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ స్టార్ జోడీ ఆ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెట్టింది. ఆదివారం నాడు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన ఎనిమిదో సీడ్ జోడీ ఆంగ్ యు సిన్ - టియోను 16-21, 21-17, 21-19తో చిత్తు సాత్విక్ - చిరాగ్ జోడీ మట్టికరిపించింది. ఈ క్రమంలోనే 58 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్ తొలి పసిడి పతకం ముద్దాడింది.

ఈ టోర్నీ1965లో లక్నో వేదికగా జరిగింది. అప్పుడు పురుషుల సింగిల్స్లో దినేశ్ ఖన్నా స్వర్ణ పతకం సాధించాడు. ఈ టోర్నీలో భారత్ కైవసం చేసుకున్న మొదటి బంగారు పతకం అదే. ఇక ఆసియా చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కు ఇప్పటి వరకు స్వర్ణ పతకం లేదు. 1971లో దీపూ ఘోష్ - రామన్ ఘోష్ సోదరులు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. అదే భారత్ తరఫున పురుషుల డబుల్స్లో అత్యుత్తమ ప్రదర్శన.
ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరిన సాత్విక్ - చిరాగ్ జోడీ.. తొలి గేమ్ కోల్పోయింది. అయినా సరే టెన్షన్ పడకుండా గట్టిగా పోరాడారు. ఒకానొక దశలో రెండో గేమ్లో 7-13, మూడో గేమ్లో 11-15తో కూడా వెనుకబడ్డారు. కానీ చివర్లో అనూహ్యంగా పుంజుకొని రెండు సెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సీజన్లో వీళ్లిద్దరికీ ఇది రెండో టైటిల్. గత మార్చిలో స్విస్ ఓపెన్ సూపర్ 300లో కూడా వీళ్లు టైటిల్ దక్కించుకున్నారు.