
హైదరాబాద్: ఇండొనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. వీళ్లిద్దరూ తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరారు. సింధు 21-13, 21-10తో స్థానిక క్రీడాకారిణి హనా రమదానిపై సునాయాస విజయం సాధించింది. రెండో రౌండ్లో క్వాలిఫయర్ జిన్ వీ (మలేషియా)ను సింధు ఢీకొననుంది.
సైనా తొలి మ్యాచ్లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి, ఏడో సీడ్ చెన్ యుఫీని 22-24, 21-15, 21-14తో ఓడించింది. తొలి గేమ్ ఓడినా స్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో పోరాడిన సైనాకు సరైన ఫలితం దక్కింది. రెండో రౌండ్లోనూ సైనా చైనాకే చెందిన చెన్ జియాగ్జిన్ను ఢీకొంటుంది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.
కశ్యప్ 18-21, 18-21తో ఫెంగ్ చాంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. సౌరభ్ 16-21, 21-12, 10-21తో సకాయ్ (జపాన్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండు చేరింది. ఈ జంట 21-15, 21-10తో టకుటో-యుకి (జపాన్) ద్వయాన్ని ఓడించింది. సుమీత్ రెడ్డి-మను అత్రి తొలి రౌండ్లో 18-21, 21-16, 16-21తో చింగ్ యావ్-యాంగ్ పొ జంట చేతిలో ఓటమి చవిచూసింది.
భారత మహిళలకు క్లిష్టమైన డ్రా:
వచ్చే నెలలో జరుగనున్న ఆసియా టీమ్ చాంపియన్షిప్లో భారత మహిళా షట్లర్ల జట్టుకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. గ్రూప్ డబ్ల్యూలో భారత్తో పాటు జపాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. జపాన్ జట్టులో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగూచి, ప్రపంచ చాంపియన్ ఒకుహరా నుంచి భారత షట్లర్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు భారత పురుషుల జట్టుకు సులువైన డ్రా లభించింది. గ్రూప్ డీలో భారత్తో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మాల్దీవ్స్ జట్లు తలపడుతాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.