సిడ్నీ: ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ను భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో చైనా క్రీడాకారిణి, ప్రపంచ నెం.12 షట్లర్ సన్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా గెలుపొందింది.
ఈ విజయంతో ప్రస్తుత సీజన్లో సైనా తొలి టైటిల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ 8వ ర్యాంకులో కొనసాగుతోంది. కాగా, ఫైనల్ ముందు రోజు సైనా కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. మంచి షాట్లతో సైనా బాగా ఆడుతోందని అన్నారు.
ఫైనల్లోనూ సైనా గెలిచి టైటిల్ కైవసం చేసుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆయన అనుకున్న విధంగానే సైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచింది.
టైటిల్ సాధించిన సైనాను ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తెలంగాణ సీఎం కెసిఆర్, బాలీవుడు నటుడు అమితాబ్ బచ్చన్ అభినందించారు. దేశానికి గర్వకారణంగా నిలిచావంటూ మోడీ.. సైనాను అభినందించారు. వీరితోపాటు పలువురు సైనాను కొనియాడారు.