
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ను గాయాలు బాధిస్తూనే ఉన్నాయి. తీరిక లేని షెడ్యూల్ మధ్య టోర్నీలు ఆడుతున్న సైనా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి గాను మరికొంత సమయం కావాలని చెప్పింది. ప్రస్తుతం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో లక్నో అవధ్ వారియర్స్ తరఫున సైనా ఆడుతోంది.
శనివారం రాత్రి నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో కెనడాకు చెందిన మైఖేల్ లీపై 4-3 తేడాతో విజయం సాధించింది. అనంతరం సైనా నెహ్వాల్ ఆదివారం మీడియాతో మాట్లాడింది. మడమ గాయంతో బాధపడుతున్న సైనా వచ్చే నెలలో జరిగే ఇండియన్ ఓపెన్కు మూడు వారాలు పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని పూర్తి సామర్థ్యాన్ని సాధిస్తానని పేర్కొంది.
పూర్తి ఫిట్నెస్ను సాధించాడనికి తనకు మరికొంత సమయం పడుతుందని సైనా నెహ్వాల్ తెలిపింది. 'ఈ టోర్నీకి ముందు మడమకి గాయం తగిలింది. అందుకే నేను మూడు వారాల తరువాత ఈ టోర్నీని ఆడాలనుకుంటున్నా. ఇప్పటికీ ఉదయం పూట ఆడేటప్పుడు నొప్పితో బాధపడుతున్నాను. ఆటలో వేగంగా కదలడం అనేది మడమల మీదే ఆధారపడి ఉంటుంది' అని సైనా పేర్కొంది.
'ఇండియన్ ఓపెన్ తర్వాత 2-3 వారాల సమయం దొరుకుతుంది. ప్రపంచ చాంపియన్షిప్ ముగిసిన తర్వాత కావాల్సినంత సమయం దొరుకలేదు. గోపి సర్ అకాడమీలో తిరిగి చేరిన తర్వాత విరామం లేకుండా వరుస టోర్నీల్లో ఆడాల్సి వచ్చింది. దీంతో గాయం తీవ్రమైంది. అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడేందుకు ఇంకా వేగంగా ఆడాల్సిన అవసరముంది' అని సైనా తెలిపింది.
'ఇండియన్ ఓపెన్ ముగిసిన తర్వాత లభించే విరామంలో పూర్తి ఫిట్నెస్ దక్కించుకోవాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది బీఎఫ్డబ్ల్యూ బిజీ షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో ఒక ఆటగాని ఆధిపత్యం కొనసాగే అవకాశం లేకుండా.. టోర్నీ టోర్నీకి కొత్త విజేతలు వచ్చే అవకాశం ఉంటుంది' అని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.