
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి థాయిలాండ్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం నిర్వాహకులు మరోసారి క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో భారత ఎస్ షట్లర్ సైనాకు కరోనా సోకినట్టు తేలింది. అయితే సోమవారం నిర్వహించిన కరోనా టెస్ట్ రిపోర్ట్ తనకు ఇంకా అందలేదని తాజాగా సైనా ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నారు.
'జనవరి 11న చేసిన కరోనా టెస్ట్ రిపోర్ట్ ఇంకా నాకు అందలేదు. చాలా గందరగోళంగా ఉంది. ఏం జరిగిందో తెలియదు. ఈ రోజు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసేముందు.. నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పారు. బ్యాంకాక్లోని ఆసుపత్రికి రావాలని చెప్పారు. నిబంధనల ప్రకారం నివేదిక 5 గంటల్లో రావాలి. కానీ నాకు ఇంకా టెస్ట్ రిపోర్ట్ అందలేదు' అని సైనా నెహ్వాల్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.
థాయిలాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్లో ఉన్న సైనా నెహ్వాల్కు సోమవారం మూడోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు హెచ్ఎస్ ప్రణయ్కి కూడా కరోనా సోకింది. దీంతో వీరిద్దరినీ ఆస్పత్రిలో క్వారంటైన్లో ఉండాల్సిందిగా నిర్వాహకులు సూచించారు. ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. అయితే టెస్ట్ రిపోర్ట్ మాత్రం ఇంకా తనకు అందలేదని సైనా ట్వీట్ చేయడం విశేషం.
కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలలపాటు ఇంటికే పరిమితమైన సైనా.. థాయిలాండ్ ఓపెన్లో పాల్గొందామని సిద్ధమైన సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడం పెద్ద షాకింగ్గా మారింది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉండగా.. కరోనా వలన థాయిలాండ్ ఓపెన్ నుంచి ఆమె పూర్తిగా తప్పుకోనున్నట్టు సమాచారం. సైనా భర్త పరుపల్లి కశ్యప్ని కూడా ఆసుపత్రికి తరలించగా.. ఆయన రిపోర్ట్స్ రావలసి ఉంది. అయితే కొద్ది రోజుల క్రితమే సైనా కరోనా నుండి కోలుకోగా.. ఇప్పుడు ఆమెకు మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తుంది.