హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ 500 టోర్నీ కొరియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో రెండో రౌండ్లో ఐదో సీడ్ సైనా 21-18, 21-18తో వరుస గేముల్లో క్వాలిఫయర్ కిమ్ గా ఈన్ (కొరియా)ను చిత్తుగా ఓడించింది.
ఆసియాకప్ ఫైనల్లో భారత్ Vs బంగ్లా: టీమిండియా ఏడోసారి సాధించేనా?
సైనా ఈ మ్యాచ్ను 36 నిమిషాల్లోనే ముగించింది. సూపర్ ఫామ్లో ఉన్న సైనా తొలి గేమ్ ఆరంభంలో 10-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రత్యర్థి కిమ్ 8-11తో పుంజుకుంది. ఆ తర్వాత సైనా 16-10తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, కిమ్ మళ్లీ 18-18తో స్కోరు సమం చేసింది.
చివర్లో సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21-18తో గేమ్ దక్కించుకుంది. ఇక రెండో గేమ్లో ఒక దశలో నెహ్వాల్ 10-13తో వెనుకంజవేసింది. ఆ తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి సైనా వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి గేమ్తో పాటు మ్యాచ్నూ కైవసం చేసుకుంది.
ఇక, క్వార్టర్స్లో సైనా క్వార్టర్ ఫైనల్లో జపాన్ షట్లర్ నజోమి ఒకుహరతో తలపడనుంది. జపాన్ షట్లర్పై నెహ్వాల్కు 6-3తో మెరుగైన గెలుపు రికార్డు ఉంది. అయితే చివరి రెండు మ్యాచ్ల్లో (ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్షిప్) ఒకుహర చేతిలో సైనా ఓడడం ఆందోళన కలిగించే అంశం.
దీంతో క్వార్టర్స్లో ఒకుహరను నెహ్వాల్ ఎలా ఎదుర్కొంటున్నదన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ సైనా నెహ్వాల్ సెమీస్ చేరితే టాప్సీడ్ అకానే యమగుచి (జపాన్)తో తలపడే అవకాశం ఉంది.