
బాసెల్: ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. తొలి రౌండ్లో బై పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సింధు, సైనా సునాయాస విజయాలతో ముందడుగేశారు. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత జోడీల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో ఐదో సీడ్ సింధు 21-14, 21-15తో పాయ్ యు (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ తొలి గేమ్లో సింధు ఆది నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో గేమ్లోనూ ఆధిక్యంలో నిలిచినా.. ఆ తర్వాత వరుస తప్పిదాలు చేసి 10-11తో వెనుకంజ వేసింది. ఈ సమయంలో విజృంభించిన సింధు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్ను గెలిచింది. ప్రిక్వార్టర్స్లో బీవెన్ జంగ్ (అమెరికా)తో సింధు తలపడనుంది.
మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21-10, 21-11 తేడాతో డీ విచ్ ఎజ్బెర్జెన్(నెదర్లాండ్స్)పై సునాయాస విజయాన్ని అందుకుంది. ప్రిక్వార్టర్స్లో మియా బిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో సైనా తలపడనుంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 13-21, 21-13, 21-16తో జిల్బర్మ్యాన్ (ఇజ్రాయిల్)పై గెలుపొందాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కాంతాపోన్ (థాయ్లాండ్)తో శ్రీకాంత్ పోటీపడతాడు. ఇక కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్.. ఆంథోని (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ పోటీపడనున్నారు.
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సుమీత్రెడ్డి-మను అత్రి 16-21, 19-21తో ఆరో సీడ్ హాన్ చెంగ్- హావొ డాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప 20-22, 16-21తో ఏడో సీడ్ యిన్ హ్యు- డు యూ (చైనా) చేతిలో.. జక్కంపూడి మేఘన- పూర్విష రామ్ 8-21, 18-21తో తనక- కొహరు (జపాన్) చేతిలో ఓడిపోయారు. ఈ ఓటములతో అందరూ టోర్నీ నుంచి నిష్క్రమించారు.