న్యూఢిల్లీ: గత ఏడాది కాలంగా పేలవమైన ఫామ్తో నిరాశ పరుస్తున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నుంచి వైదొలిగింది. వచ్చే ఏడాది బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఎర్రబంతి కంటే గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తుంది: దాదా
'పీబీఎల్ ఐదో సీజన్ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. అందుకే పీబీఎల్ సీజన్ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నా. తర్వాతి సీజన్లో ఆడేందుకు ప్రయత్నిస్తా' అని సైనా ఆదివారం ట్వీట్ చేసింది.
Hey everyone , I won’t be part of the PBL Season 5 . I haven’t been well most part of the year due to pancreatitis and injuries and I would like to take time during the PBL to prepare better . I want to say sorry to all my fans and I hope to be part of the next season of PBL .
— Saina Nehwal (@NSaina) 24 November 2019
గత సీజన్లో నార్త్ ఈస్టెన్ వారియర్స్ తరఫున ఆడిన సైనా.. ఈసారి పీబీఎల్ వేలంలో పాల్గొనడం లేదు. ఈ సీజన్ పీబీఎల్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. పాంక్రియాటిస్, గాయాల కారణంగా ఈ సంవత్సరం చాలాకాలం ఆటకు దూరంగా ఉంది. కాగా సైనా ఈ సంవత్సరం పలు టోర్నీలలో ఆరుసార్లు మొదటి రౌండ్లలో పరాజయం చవిచూసింది.
ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో సైనా 13-21, 20-22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయింది. కేవలం 30 నిమిషాల్లోనే సైనా గేమ్లలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. అంతకుముందు చైనా ఓపెన్లో తొలి రౌండ్లోనే సైనా ఇంటిదారి పట్టినవిషయం తెలిసిందే.