
హైదరాబాద్: చైనాలోని నాన్జింగ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో వరల్డ్ నంబర్ 8 క్రీడాకారిణి కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో సైనా చిత్తుగా ఓడింది.
సైనా-మారిన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ, ఈ మ్యాచ్లో కరోలినా మారిన్ ఆట ముందు సైనా తేలిపోయింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్ వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 21-6, 21-11 తేడాతో కేవలం 31 నిమిషాల్లోనే మ్యాచ్ని ముగించి సెమీ ఫైనల్లో ప్రవేశించింది.
క్వార్టర్ ఫైనల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో సైనా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అనవసర తప్పిదాలు చేసింది. మొత్తం 42 పాయింట్లలో సైనా కేవలం 17 పాయింట్లు మాత్రమే సాధించింది. 2015లో వీరిద్దరూ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడగా అప్పుడు కూడా కరోలినాదే పైచేయి. ప్రపంచ ఛాంపియన్షిప్లో 2015లో రజతం.. 2017లో కాంస్య పతకంతో సైనాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ మారిన్ చేతిలో చిత్తుగా ఓడింది.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న సైనా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నీలో కచ్చితంగా పతకం సాధిస్తున్నందనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఎనిమిదోసారి క్వార్టర్స్ చేరిన తొలి మహిళా షట్లర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
2012లో మినహా సైనా నెహ్వాల్ (2009, 2010, 2011, 2013, 2014, 2015, 2016, 2017, 2018) పాల్గొన్న ప్రతిసారి క్వార్టర్ చేరడం విశేషం. వరల్డ్ చాంపియన్షిప్లో సైనా 2015లో రజతం, 2017లో కాంస్యపతకం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లోనూ భారత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ హువాంగ్-జెంగ్ సీవీ(చైనా) చేతిలో 21-17, 21-10 తేడాతో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప జోడీ ఓటమిపాలైంది.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ ఆశలు ఇక ఇద్దరిపైనే. వారే పీవీ సింధు, సాయి ప్రణీత్. వీరిద్దరూ శుక్రవారం క్వార్టర్స్ను అధిగమిస్తే కనీసం కాంస్య పతకాలు దక్కుతాయి. గతేడాది ఈ టోర్నీలో సింధు రజతం నెగ్గగా, సైనా కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే.